అంతకంటే ఎక్కువిస్తామని మెలిక: ప్రత్యేక హోదాపై తేల్చేసిన జైట్లీ, ఏం చేశామంటే...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. హోదాకు బదులు రాష్ట్రానికి కావాల్సిన, దక్కాల్సిన సాయం అంతటిని కేంద్రం చేస్తుందని చెప్పారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అరుణ్ జైట్లీలు కలిసి మంగళవారం సాయంత్రం ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ఆర్థిక సాయంపై ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని చెప్పారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా అన్న తమ హామీ పైన తాము వెనక్కి తగ్గలేదన్నారు.
ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు భేటీలో తాను, నీతి అయోగ్ చైర్మన్ కూడా పాల్గొన్నామని చెప్పారు. ఏపీకి తొలి ఏడాది కొంత ఆర్థిక సాయం చేశామని చెప్పారు. వెనుకబడిన ఏడు జిల్లాలకు పన్నుల్లో వెసులుబాటు కల్పించామని చెప్పారు.
ప్రధానితో జరిగిన గంటన్నర భేటీలో ఒక్కో అంశంపై క్షుణ్ణంగా చర్చించామని చెప్పారు. గతంలో ఇచ్చిన వినతిపత్రం, ఇప్పుడు ఇచ్చిన వినతి పత్రంపై సమీక్షించామన్నారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న హామీలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
రెవెన్యూ లోటు భర్తీకి తొలి ఏడాది కొంత సాయం చేశామన్నారు. విభజన చట్టంలోని అంశాలన్నింటికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ చెప్పారన్నారు. ఏపీలో జాతీయస్థాయి సంస్థలకు ఇప్పటికే కేంద్రమంత్రులు శంకుస్థాపన చేశారన్నారు. పలు విద్యాసంస్థలు నెలకొల్పామన్నారు.
రాజధాని నిర్మాణానికి ప్రాథమికంగా కొన్ని నిధులు విడుదల చేశామన్నారు. విజయ దశమి నాడు జరిగే రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోడీని ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానించారని చెప్పారు. అన్ని హామీలు నెరవేర్చేలా ప్రధాని ఆదేశించారన్నారు.
ఈ ఏడాది నుంచి వచ్చే ఐదేళ్లు రెవెన్యూ లోటును ఫైనాన్స్ కమిషన్ లెక్కిస్తుందని చెప్పారు. రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. రెవెన్యూ లోటు, గ్రాంట్, ప్రాజెక్టుల వంటి కేంద్రం సాయం కొనసాగుతుందని చెప్పారు.
వివిధ మార్గాల్లో ఏపీకి ఆర్థిక సాయం కొనసాగుతుందని చెప్పారు. నీతి అయోగ్ సిఫార్సులు వచ్చాక ప్రధాని అన్ని విషయాలపై ప్రకటన చేస్తారన్నారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పామని, నాటి ఆర్థిక సాయం హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సభా వేదికపై నాడు ఏపీ కోసం పోరాడామని, దానికి కట్టుబడి ఉన్నామన్నారు. మీరు ఆశించిన దానికన్నా ఏపీ ఎక్కువ ప్రయోజనం పొందుతుందని చెప్పారు.
ఏం చేశామంటే...?
రెవెన్యూ లోటు భర్తీకి తొలి ఏడాది కొంత ఆర్థిక సాయం ఏపీలో జాతీయస్థాయి విద్యాసంస్థలను నెలకొల్పాం వెనుకబడిన 7 జిల్లాలకు పన్నుల్లో వెసులుబాటు కల్పించాం రాజధాని నిర్మాణానికి కొన్ని నిధులు విడుదల చేశాం ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యామ్నాయం రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు కేంద్రం సిద్ధం రెవెన్యూ లోటు, గ్రాండ్, ప్రాజెక్టులకు సాయం కొనసాగుతుంది.