మనవడితో ఆడుకోలేకపోతున్నా: బాబు మనసు తహతహ, ఎందుకు ఓడానంటే..
హైదరాబాద్: సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేత ఎవరూ లేరని, ఇప్పుడు నవ్యాంధ్ర కోసం రోజుకు 18 గంటలు పని చేస్తున్నానని, తన మనవడు దేవాన్ష్తో కూడా ఆడుకోలేకపోతున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు.
ఆదివారం పార్క్ హోటల్లో స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. రాజకీయ జీవితంలో తాను ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, సంక్షోభంలో అవకాశాలను సృష్చించుకోవచ్చునని చైనా సామెత స్ఫూర్తితో తాను పని చేస్తానని చెప్పారు.
విభజన నేపథ్యంలో ఏపీని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించే సత్త తనకే ఉందన్న నమ్మకంతో ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించారన్నారు. విజన్ 2020 విధానంతో ఉమ్మడి ఏపీ అభివృద్ధికి కృషి చేశానని, ప్రత్యేక దృష్టి పెట్టినందు వల్లే ఐటీ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందన్నారు.
ప్రజల అంచనా మేరకు నడుచుకుంటున్నానని, ఎన్ని సవాళ్లు ఎదురైనా వారి ఆశయాల కోసం పని చేస్తాననన్నారు. నవ్యాంధ్ర ఏపీగా రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తున్నానని, కనీసం మనవడితో ఆడుకోలేకపోతున్నానని చెప్పారు. మనవడితో ఆడుకోవాలని మనసు తహతహలాడుతోందన్నారు.
అయినా వీలు చిక్కడం లేదన్నారు. ప్రజా జీవితంలో కొన్ని త్యాగాలు తప్పవని చెప్పారు. సంపదను సృష్టించడంలో లీక్యూన్ యూ, డెంగ్ జియావోపింగ్, బిల్ గేట్స్ తదితరులు స్ఫూర్తిగా నిలిచారన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చంద్రబాబును ప్రశ్నించారు. విజయవంతమైన సీఎంగా ఉంటూ 2004లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు.
దానికి బాబు స్పందిస్తూ.. ఓటమికి అనేక కారణాలున్నాయని, వైఫల్యాలు అంగీకరించడంలో నిజాయితీగా ఉంటానని చెప్పారు. నాటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్లినా, ప్రజా విశ్వాసం పొందడంలో విఫలమయ్యానని చెప్పారు. రాజకీయ రంగంలో స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తినిచ్చారని చెప్పారు.