మల్లేశ్వరస్వామి ఆలయంలో మాంసాహార కలకలం - భక్తుల మండిపాటు..!!
ప్రముఖ దేవాలయంలో అపచారం చోటు చేసుకుంది. దేవాలయం ప్రాంగణంలోనే మాంసాహారం వండటం కలకలం రేపింది. దీని పైన భక్తులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆ ఘటన చోటు చేసుకుంది. ఆలయ క్యాంటీన్లో నిర్వహకులు మాంసాహారం వండటం ఇందుకు కారణమైంది. నిత్యం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఈ క్యాంటిన్లో అల్పాహారం, అన్నదానం చేస్తుంటారు. కానీ..అదే క్యాంటిన్లో మాంసాహారం వండటం విమర్శలకు దారితీస్తోంది.
ఓ అధికార పార్టీ నేత ఈ క్యాంటిన్ ను ఇతరుల పేరుతో వేలంలో దక్కించుకున్నట్లు చెబుతున్నారు. తనకు వచ్చిన ఓ ఆర్ధర్ లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని క్యాంటిన్ లో మాంసాహారం వండి.. బయటకు పంపించారని సమాచారం. దీనిని గమనించిన భక్తులు మాంసాహార వంటకాలను ఫొటోలు తీసారు. దీంతో..ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎంతో చరిత్ర ఉన్న కాకాని దేవాలయంలో ఇలాంటివి చోటు చేసుకోవటం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషక్ష్ం తెలిసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడుతున్నారు.

ఆలయ భక్తులకు ప్రసాదాలు అందించే క్యాంటీన్ నుంచి బయట ఆర్డర్లు వచ్చిన మాంసాహార వంటకాలు సిద్దం చేయటం ఏంటని నిలదీస్తున్నారు. అయితే, దీని పైన క్యాంటిన్ నిర్వాహకులను పిలిచి వివరణ అడిగినట్టు సమాచారం. అయితే, మాంసాహారం బయటే వండానని, ఆర్డర్ ఇచ్చే వారికి అందజేసే క్రమంలో మాంసాహారం ఉన్న రిక్షా లోపలికి వచ్చిందని అధికారులకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. దేవాలయంలోకి వచ్చే భక్తులను అన్నదానం చేసే క్యాంటీన్ లో మాంసాహారం వండటంతో ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు కారణం అవుతోంది. ఆలయ వర్గాలతో పాటు స్థానికులు కూడా ఈ విషయంపై ఆగ్రహంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications