నారా బ్రాహ్మణిపై అసభ్యకర పోస్టులు
సోషల్ మీడియాలో నారా బ్రాహ్మణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కోదాటి నరసింహ అనే వ్యక్తి ఖమ్మం టేకులపల్లిలో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. తన ఫేస్బుక్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టడంతోపాటు వ్యక్తిగతంగా కించపరిచాడు. ఖమ్మం తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయాన్ని గుర్తించారు.
వీరు కోదాటి నరసింహను ఫోన్ లో ప్రశ్నించగా ముస్తఫానగర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నానని చెప్పాడు. అక్కడికి వెళ్లి వ్యక్తిగతంగా ఎందుకు పోస్టులు పెట్టావని అడగటంతో వారిపై అతను దురుసుగా ప్రవర్తించాడు. ఆగ్రహానికి గురైన నాయకులు అతనికి దేహశుద్ధి చేశారు. నారా, నందమూరి కుటుంబాలకు చెందిన వ్యక్తులపై వ్యక్తిగతంగా అసభ్య పదజాలం వాడితే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ లోక్సభ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతలు పెడుతున్న పోస్టులు శ్రుతిమించుతున్నాయి. ప్రత్యర్థులుగా కాకుండా శత్రువుల్లా ఇరుపార్టీల నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫేస్ బుక్, ట్విటర్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా గ్రూపులో పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా కామెంట్లు చేస్తున్నారు. పార్టీ పరంగా ఏమైనా ఉంటే మనం మనం చూసుకుందామని, కుటుంబంలోని స్త్రీలను ఇందులోకి లాగవద్దని ఇటీవలి బీఏసీ సమావేశంంలో ముఖ్యమంత్రి జగన్, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఒప్పందానికి వచ్చారు. కానీ పోస్టులు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉండటంపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.