జగన్కు కేశినేని శ్వేత వార్నింగ్ -సునామీని తట్టుకోగలరా? -సీఎం ఇంట్లో సూట్ కేసులు -అమరావతి పోరు
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటన, ఆ వెంటనే మొదలైన అమరావతి రైతుల నిరసనలకు ఏడాది పూర్తికావొచ్చింది. ఈనెల 17నాటికి అమరావతి ఆందోళనలు 365వ రోజుకు చేరుతుండటంతో అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ భారీ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా మంగళవారం విజయవాడలో పాదయాత్ర నిర్వహించారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు నేరుగా పాదయాత్రలో పాల్గొనగా, బీజేపీ తన మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో..
జగన్పై శ్వేత సంచలన వ్యాఖ్యలు
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో నిర్వహించిన పాదయాత్రలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ఉండాలంని, అమరావతి రైతులు, మహిళల పట్ల జగన్ సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని నినాదాలు చేశారు. పాదయాత్ర నేపథ్యంలో విజయవాడలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న టీడీపీ మహిళా నాయకురాలు, విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత.. సీఎం జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సునామీని తట్టుకోగలరా?
‘‘వైఫల్యాలకు, మూర్ఖత్వానికి మారు పేరుగా జగన్ నిలిచారు. అమరావతి రాజధాని కోసం ఏడాదిగా మహిళలు, రైతులు ఉద్యమిస్తుంటే.. దీక్షా శిబిరాల మీదుగా సచివాలయానికి వెళ్లే సీఎం ఒక్కరోజైనా ఆగి రైతులతో మాట్లాడలేదు. కేవలం మూర్ఖత్వతోనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిగా అమరావతికి గుప్పెడు ఇసుక కూడా ఇవ్వలేదు. కరోనాను సైతం లెక్కచేయకుండా రాజధాని కోసం విజయవాడ యువకులు వేలాదిగా సైన్యంలా ముందుకు వచ్చారు. ఈ సైన్యం సునామీగా మారితే జగన్కు తట్టుకునే శక్తి జగన్ కు ఉందా?'' అని కేశినేని శ్వేత అన్నారు. మరోవైపు..
సీఎం ఇంట్లో సూట్ కేసులు..
టీడీపీకే చెందిన మరో మహిళా నేత పంచుమర్తి అనురాధ సైతం రైతుల ఆందోళనలకు మద్దతుగా, వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా తీవ్ర కామెంట్లు చేశారు. అమ్మలాంటి అమరావతికి జగన్రెడ్డి మరణశాసనం రాశారని ధ్వజమెత్తారు. రాజధాని మహిళలను ప్రభుత్వం వేధించడం మొదలుపెట్టి ఏడాది కావొస్తోందని తెలిపారు. 3 రాజధానుల నిర్ణయంతో మహిళలకు చీకటి రోజులొచ్చాయన్నారు. జగన్ ఇంట్లో లక్షల కొద్దీ సూటుకేసులు, ప్రజలపైన లక్షల కేసులా? అంటూ అనురాధ నిలదీశారు.
భారత్కు అమెరికా హెచ్చరిక -ట్రంప్ చివరి బాంబు -టర్కీపై ఏకంగా ఆంక్షలు -రష్యన్ S400 క్షిపణుల రచ్చ