వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై ? కాసేపట్లో ప్రెస్ మీట్..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రజాప్రతినిధులు సేఫ్ ప్లేస్ లు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకూ తాము ఉన్న పార్టీల్లో పరిస్ధితులు బావుంటే సరి.. లేకపోతే ఏమాత్రం ఆలోచించకుండా సొంత పార్టీలకు గుడ్ బై చెప్పేసి ప్రత్యర్ధి పార్టీల్లోకి ఫిరాయించేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి విపక్ష టీడీపీ, జనసేనలోకి ఫిరాయిస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ మరో ఎంపీ వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీగా తొలిసారి పోటీ చేసి గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఆ పార్టీ తాజాగా చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో నిరాశ తప్పలేదు. ఒంగోలు ఎంపీగా మాగుంటను కాదని ఆ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా తెచ్చింది. ఈ విషయంలో ఒంగోలు సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అడ్డుచెప్పినా సీఎం జగన్ పట్టించుకోలేదు. దీంతో చివరి నిమిషం వరకూ ప్రయత్నించినా బాలినేని కూడా వదిలేశారు.

దీంతో మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్టీ మార్పు ఖాయమైపోయింది. ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లిన మాగుంట తన, తన కుమారుడి భవిష్యత్తుకు హామీ ఇస్తే టీడీపీలో తిరిగి చేరేందుకు సిద్దమని చెప్పేశారు. ఈ మేరకు చంద్రబాబు నుంచి ఆయనకు హామీ లభించిందని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఒంగోలులు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీకి రాజీనామా ప్రకటన చేసేందుకు సిద్దమవుతున్నారు. అలాగే టీడీపీలో చేరికపైనా స్పష్టత ఇవ్వనున్నారు.
ఇవాళ ప్రెస్ మీట్ తర్వాత మంచి రోజు చూసుకుని మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయనకు ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటిస్తారని సమాచారం. గత ఎన్నికలకు ముందు టీడీపీలోనే ఎంపీగా ఉన్న మాగుంట.. ఎన్నికల సమయంలో వైసీపీలోకి ఫిరాయించి మరోసారి పోటీ చేసి గెలిచారు.












Click it and Unblock the Notifications