జనసేనలో జగడం: క్రమంగా పార్టీని వీడుతున్న నేతలు..తాజగా టెక్కలి నేత పార్టీకి గుడ్బై
టెక్కలి: జనసేన పార్టీలో కొత్తగా నేతలు చేరకపోగా ఉన్న నేతలే పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు జనసేన పార్టీలో ఉండి ఆ పార్టీ జెండా మోసి చివరి క్షణంలో టికెట్ దక్కకపోవడంతో పార్టీని వీడారు. ఈ షాక్ నుంచి జనసేన అధినాయకత్వం తేరుకోకముందే మరో నియోజకవర్గ నేత జనసేనకు గుడ్బై చెప్పేశారు. ఇతనితో పాటు దాదాపు 20వేల మంది కార్యకర్తలు రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జనసేన పార్టీకి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు నాయకులు పార్టీని వీడారు. అదే బాటలో మరో నాయకుడు మాజీమంత్రి అయ్యప్ప మేనల్లుడు పైలా రమేష్ కూడా జనసేన పార్టీకి రాజీనామా చేశారు. తనతో పాటు మరో 20 వేల మంది కార్యకర్తలు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం తాను చాలా కష్టపడ్డానని చెప్పిన పైలా రమేష్ తనకు టికెట్ ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ మోసం చేశారని ఆరోపణలు చేశారు.
ఇక తనకు టికెట్ ఖాయంగా వస్తుందని భావించినట్లు చెప్పిన పైలా రమేష్... నామినేషన్కు వారంరోజుల ముందు కూడా తనకే టెక్కలి నియోజకవర్గం టికెట్ వస్తుందని అధిష్టానం నుంచి కబురు వచ్చిందని చెప్పారు . కానీ అన్నీ ఒక్కరాత్రిలోనే తారుమారై తెరపైకి కణితి కిరణ్ కుమార్ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి కనుక్కుందామని అధిష్టానానికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన అక్కడి నుంచి స్పందన కరువైందని అసలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు పైలా రమేష్.
ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా జనసేన పార్టీని నేతలు నాయకులు చాలామందే వీడుతున్నారు. కొందరు అసంతృప్తితో బయటకు రాగా మరికొందరు టీడీపీకి జనసేన అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ బాహాటంగానే ఆరోపణలు చేశారు. కొద్ది రోజుల ముందు కమ్యూనిస్టులు కూడా ఇదే వాదనను వినిపించారు. ఒకానొక సమయంలో పొత్తును కూడా రద్దు చేసుకుందామనే ఆలోచనకు వచ్చారు కమ్యూనిస్టు నేతలు. ఇక మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారికి... వారి నియోజకవర్గంలో అభ్యర్థిని ఖరారు చేసే సమయంలో జనసేన అధినాయకత్వం తమను సంప్రదించలేదనే ఆరోపణలు కూడా చేశారు.












Click it and Unblock the Notifications