అమరావతిలో హైడ్రోజన్ బాంబుల తయారీ: పాకిస్తాన్ షాకింగ్ కథనాలు
అమరావతి/లాహోర్: విభజన నేపథ్యంలో ఏపీలోని గుంటూరు - కృష్ణా జిల్లాల్లోని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తోంది. ప్రాచీన బుద్ధిస్ట్ చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎంచుకుంది.
ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, ఇతర దేశాలను ఆకర్షించే ఉద్దేశ్యంలో భాగంగా ప్రాచీన చరిత్ర కలిగిన అమరావతిని రాజధానిగా ఎంచుకుంది. అయితే, ఈ నూతన రాజధాని పైన పాకిస్తాన్ మీడియాలో షాకింగ్ వార్తలు వస్తున్నాయి.
తుళ్లూరు పరిధిలో అమరావతి పేరిట నూతన రాజధాని కోసం ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వెలగపూడి పరిధిలో తాత్కాలిక రాజధానిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 27 లోగా తాత్కాలిక సచివాలయం పనులు పూర్తి కానున్నాయి.
ఇక సచివాలయానికి ఉద్యోగులు వచ్చి వెళ్లేందుకు అక్కడ రహదారులు కూడా ఏర్పాటవుతున్నాయి. వెరసి ఓ రాష్ట్ర పాలనకు సంబంధించిన కేంద్రం అక్కడ రూపుదిద్దుకుంటోంది. దీంతో, నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో హడావుడి కనిపిస్తోంది.
అయితే ఈ పనుల పైన పాకిస్తాన్ మీడియా వింత కథనాన్ని ప్రసారం చేసింది. ఈ నెల 3న పాకిస్తాన్కు చెందిన ఓ టీవీ ఛానెల్లో జరిగిన చర్చా గోష్టి సందర్భంగా ఆ దేశానికి చెందిన ఓ వ్యక్తి.. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం జరుగుతోందని, అక్కడ హైడ్రోజన్ బాంబులను ఏపీ ప్రభుత్వం తయారు చేస్తోందని సదరు వ్యక్తి తేల్చాడు. అంతేకాదు, అమరావతి నిర్మాణానికి అమెరికా సహకరిస్తుందని చెప్పాడు. అమరావతి డిజైన్లోని ఓ చిమ్ని లాంటి నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ గత నెలలోనూ ఆ దేశ మీడియాలో ఆసక్తికర కథనాలు ప్రసారమయ్యాయి.
ఇక మీడియాకు వంత పాడిన పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ముందూ వెనుకా చూసుకోకుండా అమరావతిలో నిర్మిస్తున్న న్యూక్లియర్ సిటీ నిర్మాణంపై నిశిత పరిశీలన చేస్తున్నట్లు ప్రకటించింది. తొలి టీవీ ఫుటేజీ ఆదారంగా మీడియాలో పెద్ద ఎత్తున పాక్లో అమరావతిపై కల్పిత వార్తలు వస్తున్నాయి. ఓ తెలుగు టీవీ ఛానల్ అమరావతి పనుల ప్రారంభం గురించి టెలికాస్ట్ చేయగా దానిని తీసుకొని వారు వింత కథనాలు ఇచ్చారు.