కాణిపాకం ఆలయం: పంచామృత్ అభిషేక టికెట్ రేట్లు భారీగా పెంపు, రూ. 5వేలు!
చిత్తూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో అభిషేకం ధరలను ఆలయ అధికారులు అమాంతం భారీగా పెంచేశారు. అయితే, భక్తుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే అమల్లోకి తీసుకొస్తామని చెబుతున్నారు. పెంచిన ధరలపై ఉభయదారులు తమ అభిప్రాయాలను చెప్పేందుకు గడువు కూడా ఇచ్చింది.
కాణిపాకం ఆలయంలో అభిషేకం టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో స్వామివారి పంచామృత అభిషేకం టికెట్ ధరలను పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో పంచామృతాభిషేకం ధర ఏకంగా 7 రెట్లు పెంచారు.

ప్రస్తుతం పంచామృత అభిషేకం టికెట్ ధర రూ. 700 ఉంది. అయితే, 7 రేట్లు పెంచిన తర్వాత ఏకంగా ఈ టికెట్ ధర రూ. 5000లకు చేరుకుంది. కాగా, వరసిద్ధి ఆలయంలో ఇప్పటి వరకు ప్రతి రోజూ మూడు సార్లు పంచామృత అభిషేకం నిర్వహిస్తున్నారు.
ఇక నుంచి ఈ సేవ భక్తులకు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక అభిషేకం టికెట్ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ పంచామృతాభిషేకం పెంచిన ధరలపై 15 రోజుల్లోగా తమ అభిప్రాయాలను ఉభయదారులను కోరింది.
ధరలు పెంచడం లేదంటూ దేవాదాయ శాఖ క్లారిటీ
టికెట్ రేట్ల పెంపుపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దేవాదాయ శాఖ స్పందించింది. కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో అభిషేకం టికెట్ ధర పెంచలేదని, ఇప్పటి వరకు ఉన్న రూ. 700ల టికెట్ ధర యధావిధిగా కొనసాగిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications