సీమాంధ్ర రాజధాని కోసం వేట, ఆప్షన్స్: ఆ మూడింట..!
సీమాంధ్ర రాజధాని కోసం వెదుకులాట ప్రారంభమైంది. కొత్త రాష్ట్రానికి రాజధానిని ఏర్పాటు చేసేందుకు మూడు ప్రాంతాలకు ప్రాథమికంగా గుర్తించారు. అందులో రెండు ప్రాంతాలు అన్నింటికీ అనుకూలంగా ఉంటాయని అధికార్లు చెబుతున్నారు. ఈ మేరకు విభజన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సోమవారం సమావేశమై వివిధ కోణాల్లో చర్చించింది. మరికొన్ని సమావేశాల అనంతరం వాస్తవ నివేదికను కేంద్రానికి పంపించాలని కమిటీ భావిస్తోంది.
ముందుగా విస్తారంగా ఖాళీ ప్రదేశం లభించే దొనకొండ ప్రాంతాన్ని గుర్తించారు. ప్రకాశం జిల్లాలోని అటవీ ప్రాంతంగా ఉన్న దొనకొండతో పాటు, ఎర్రబాలెం, గంగదొనకొండ, వబ్బాపురం, పశ్చిమ గంగవరం, అబ్బాయపాలెం వంటి గ్రామాలను కలిపి రాజధానిగా చేసేందుకు ఆస్కారం ఉంటుందని గుర్తించారు. ఈ ప్రాంతంలో పురాతన విమానాశ్రయం రన్వే కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉంటుంది.

ఇతర ప్రాంతాలకు రవాణా వ్యవస్థ అనుసంధానం కూడా పెద్దగా లేదు. అటవీ ప్రాంతంలో ఉండటంతో ఇతర ప్రతికూల వాతావరణం కూడా ఉంటుందని అధికారులు నివేదికలో పొందుపర్చారు. రెండో ప్రత్యామ్నాయ రాజధానిగా నాగార్జునసాగర్ ప్రాంతాన్ని గుర్తించారు. గుంటూరు జిల్లాలోని సాగర్కు ఆనుకుని ఉన్న మాచర్ల, కొత్తపల్లి, చింతాల తండా, రాయవరం, రాచమల్లిపాడు, కంభంపాడు వంటి గ్రామాలను కలిపి కొత్త రాజధాని ఏర్పాటు చేయవచ్చునని యోచిస్తున్నారు.
ఈ ప్రాంతంలో వాడుకలోలేని రన్వే ఉండటం, అది కూడా వినియోగించే స్థితిలోనే ఉండటంతో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికార్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను కలుపుతూ రవాణా వ్యవస్థ కూడా బాగున్నట్టు అధికారులు గుర్తించారు. రాజధానికి అవసరమైన నీటి వనరులు కూడా ఎక్కువగా ఉండటం, వాతావరణరీత్యా కూడా కొత్త రాజధానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని అధికారులు గుర్తించారు.
మూడో ప్రత్యామ్నాయంగా... తెరపైకి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన హనుమాన్ జంక్షన్ - ఏలూరు మధ్య ప్రాంతం వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుబాటులో అసైన్డ్ భూమి ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చుకోవడానికి 20 కిలోమీటర్ల దూరంలో గన్నవరం విమానాశ్రయం ఉండటం, పోలవరం కాల్వల ద్వారా నీటి సదుపాయం ఉన్నాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
మూడు ప్రతిపాదనల్లో సాగర్, హనుమాన్ జంక్షన్ ప్రాంతాలు అత్యంత అనుకూలంగా ఉంటాయన్న అభిప్రాయాన్ని నివేదికలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. కొత్త రాజధాని ఏర్పాటుకు 10వేల హెక్టార్ల భూమి అవసరమవుతుందని గుర్తించారు. రైతులకు, ఇతర స్థల యజమానులకు పరిహారాన్ని చెల్లించి రాజధానికి అవసరమైన భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఏర్పడిన రాష్ట్రాల్లో రాజధానులను ఎంపిక చేసిన విధానాన్ని కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
కాగా, సీమాంధ్రకు నూతన రాజధాని ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. నూతన రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీకి ఈ కమిటీ సహాయ, సహకారాలు అందించనుంది. రాజధానికి సంబంధించి పలు ఆప్షన్స్ ఇవ్వాలని ఈ కమిటీ యోచిస్తోంది.
విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో అక్కడ రాజధాని నిర్మాణానికి తీసుకున్న చర్యలు, ప్రాతిపదికత తదితర అంశాలను కూడా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా గుజరాత్, ఛత్తీస్గఢ్, అస్సాం రాజధానుల ఏర్పాటులో అవలంబించిన విధానాలను పరిశీలించనున్నారు. ఏప్రిల్ నాటికి తమ పనిని పూర్తి చేసి నివేదిక సిద్ధం చేయాలని యోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications