హరీష్పై పరకాల, జగన్ ఢిల్లీ పర్యటనపై దేవినేని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటా విద్యుత్ కంటే ఐదు శాతం ఎక్కువ తీసుకుంటూ మరోవైపు, ఏపీ ప్రభుత్వం తెలంగాణకు 1320 మిలియిన్ యూనిట్ల విద్యుత్ రానివ్వకుండా చేస్తోందని అబద్దపు ప్రచారం చేస్తున్నారన్నారు.
మీ అబద్దాల రోజువారీ సీరియల్ ఆపాలన్నారు. అబద్దాల రోజువారి సీరియల్ను వారం సీరియల్గా మార్చారా అని ప్రశ్నించారు. సీలేరు, హిందూజా, కృష్ణపట్నం నుడి విద్యుత్ను ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
హరీష్ రావు తమ రాష్ట్రానికి రావాల్సిన 54 శాతం రాలేదని బొంకుతున్నారన్నారు. హిందూజా ప్రాజెక్టు పూర్తే కాలేదు, ఇంకా విద్యుత్ ఎలా ఇస్తారని శనివారం ప్రశ్నించారు.
జగన్, రఘువీరాల పైన దేవినేని
పోలవరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, వైసీపీ అధ్యక్షులు జగన్ కుట్ర పన్నుతున్నారన్నారు.
అనంతపురం జిల్లాలో పలు ప్రాజెక్టుల్లో రఘువీరా బంధువుల అవినీతిని బయటపెట్టినందుకే పోలవరంపై రఘువీరా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జిల్లాలని శ్రీరామరెడ్డి ప్రాజెక్టులో రూ.77 కోట్ల అవినీతి జరిగినట్టు విజిలెన్స్ విభాగం వెల్లడించిందని తెలిపారు. దీని వెనుక రఘువీరా హస్తం ఉందని ఆరోపించారు. జగన్ ఢిల్లీ వెళ్లి కేసుల నుంచి తప్పించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని వేడుకోలేదా? అని ప్రశ్నించారు.