కొడుకుని చంపించిన పేరెంట్స్, కృష్ణాలో ఇద్దరి గల్లంతు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడు మండలంలో ఘోరం వెలుగు చూసింది. కిరాయి హంతకులతో కన్న కొడుకునే తల్లిదండ్రులు హత్య చేయించారు. అనంతరం పోలీసుల ఎదుట నిందితులు లొంగిపోయారు. కొడుకు చిత్రహింసలు భరించలేకే హత్య చేయించామని తల్లిదండ్రులు చెప్పారు.
కృష్ణాలో మునిగి ఇద్దరు గల్లంతు
జిల్లా అమరావతి పెద్దింటమ్మ గుడి సమీపంలో ఇసుక రీచ్ వద్ద అమరావతికి చెందిన నలుగురు యువకులు ఆదివారం సాయంత్రం స్నానానికి దిగారు. వీరిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అమరావతికి చెందిన నాగుల్ మీరా, వంశీ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు లోతులో పడి గల్లంతయ్యారు. వీరితోపాటు స్నానానికి వెళ్లిన ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
తల్లి, కుమారుడు సజీవ దహనం
వంట చేస్తుండగా పొయ్యి పక్కనే ఉన్న కిరోసిన్ దీపం పొయ్యిలో పడి మంటలు వ్యాపించడంతో తల్లి, కుమారుడు సజీవ దహనమైన సంఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్ట పంచాయతీలోని చాట్లమడ గ్రామంలో ఆదివారం జరిగింది.
చాట్లమడ గ్రామానికి చెందిన బైనపోగు నాగమ్మ ఆదివారం ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిరోసిన్ ఒలికి మంటలు వ్యాపించడంతో పొయ్యి దగ్గరే ఉన్న ఏడాది బిడ్డ కార్తీక్ ససహా నాగమ్మ మంటల్లో సజీవ దహనమైంది. ఈ విషయాన్ని మృతురాలి భర్త తమకు ఫిర్యాదు చేశాడని ఎస్సై సురేష్ చెప్పారు. పూర్తి వివరాలు సేకరించాక కేసు నమోదు చేస్తామన్నారు.
ప్రియుడి గొంతు కోసిన ప్రియురాలు
ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేయటంతో ఆగ్రహించిన ప్రియురాలు ప్రియుడి గొంతును బ్లేడ్తో కోసిన సంఘటన ఆదివారం ఖమ్మంలో జరిగింది. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం సమీపంలో కూరవపల్లి తండాకు చెందిన ఫైదా కరుణ ఖమ్మంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతోంది.
అదే కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న వెంకటాపురం మండలం ఉప్పిడి వీరాపురం గ్రామానికి చెందిన పాండురంగా రావు(23)తో మూడు సంవత్సరాల కిందట పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఆ తర్వాత వారు ఇరు కుటుంబసభ్యులను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈలోగా ప్రియుడు ఇటీవల మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న యువతి పాండురంగారావును ఓ ప్రాంతానికి రప్పించి, అతను రాగానే బ్లేడ్తో యువకుడి గొంతు కోసింది. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుపడి యువకుడిని ఆసుపత్రికి తరలించారు.