బాబూ! నిన్ను రానీయం, మీరెంత గొప్పవారంటే: చిరంజీవిని లాగి పవన్ కళ్యాణ్ ఫైర్
జంగారెడ్డిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు నేపథ్యంలో ఆయన స్పందించారు. చంద్రబాబు ఎంత గొప్పవాడంటే అంటూ విమర్శలు గుప్పించారు. తాను తన అన్నయ్య చిరంజీవిని కాదని, తనకు జీవితాన్ని ఇచ్చిన సొంత అన్నను కాదని, ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని, 2014లో టీడీపీకి మద్దతిచ్చానని, ఇప్పుడు అదే కాంగ్రెస్తో చంద్రబాబు కలిసేంత గొప్పవారు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ హఠావో అని పిలుపునిస్తే, ఆ పార్టీతో కలుస్తున్నారన్నారు.
ఏపీలో మారుతున్న సమీకరణాలు, బాబును గెలవనీయను, జగన్ గెలిచే ప్రసక్తి లేదు: పవన్ కళ్యాణ్
తన అన్నయ్య ఉన్నప్పటికీ తాను కాంగ్రెస్ను కాదనుకొని ఎవరికోసం మద్దతిచ్చానో అదే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నారన్నారు. అంతటి గొప్పవాడు అన్నారు. కాంగ్రెస్ అంటే తనకు కోపం కాదని, కానీ చంద్రబాబు ఎప్పుడు ఎవరితో జతకడతాడో తెలియదన్నారు. డబ్బులు ఉంటే ముఖ్యమంత్రి, ప్రధాని అవుతారనుకుంటే ముఖేష్ అంబానీ ప్రధానిగా, జగన్ 2014లో ముఖ్యమంత్రిగా అయ్యేవారన్నారు. రాజకీయాల్లో డబ్బులు ప్రధానం కాదన్నారు.
బాబూ! రూ.50 కోట్లు ఖర్చు చేసినా టీడీపీని అధికారంలోకి రానీయం
2019లో చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో రూ.25 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని, కానీ వారు రూ.50 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేరన్నారు. చంద్రబాబుకు ఒకటే చెబుతున్నానని, రూ.25 కోట్లు కాదు రూ.50 కోట్లు ఖర్చు పెట్టినా, మీరు అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత జనసేనది అన్నారు. సీఎంకు అండగా ఉంటే మోసం చేశారన్నారు. డబ్బులు ప్రధానమంత్రిని, వేల కోట్లు ముఖ్యమంత్రిని చేయలేవన్నారు. ప్రజాబలం ముఖ్యమంత్రి, ప్రధానిని చేస్తుందన్నారు.
కావూరి సాంబశివ రావు పేరు ప్రస్తావన
తాను బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ కోసం వచ్చానని పవన్ చెప్పారు. తాను ఒక్కడిని గెలిచేందుకు రాలేదని, మీ అందర్నీ గెలిపించేందుకు వచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కావూరి సాంబశివ రావు పేరు ప్రస్తావించారు. ఓ కుటుంబాన్ని నడపడమే కష్టమని, అలాంటిది ఇన్ని కోట్ల మందితో కూడిన రాజకీయం చేయాలంటే ఎంతో అనుభవం కావాలని, అందుకే 2014లో పోటీ చేయలేదన్నారు. 2009, 2014లో తనకు రెండుసార్లు అనుభవం వచ్చిందని చెప్పారు. నేను ఓ కులాన్ని, మతాన్ని బేస్ చేసుకొని రాజకీయాల్లోకి రాలేదన్నారు. గిరిజన సంస్కృతుల నుంచి అన్ని సంస్కృతులను ప్రేమించిన వాడిని అన్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పైన పవన్
ఆడవారి ఇబ్బందులు అర్థం చేసుకొని తాను ఉచిత గ్యాస్ సిలిండర్ అని హామీ ఇచ్చానని పవన్ చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1 బియ్యం తినడానికి పనికి వచ్చేవి కావన్నారు. అందుకే బియ్యం బదులు రూ.2500 నుంచి రూ.3500 వరకు ఆడపడుచుల అకౌంట్లలో వేస్తామని చెప్పారు. ఈ మధ్య అందరూ రిజర్వేషన్ అంటున్నారని, చట్టసభల్లో ఆడపడుచులకు రిజర్వేషన్ ఇవ్వాలనేది ఆలోచన అన్నారు. జనసేన పెట్టిన పథకాలనే కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందని చెప్పారు.
అధికారం కోసం ఎవరితోనైనా పొత్తు
భగవంతుని దయతో, మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పోలవరం భాదితులకు పూర్తి అండగా ఉండి, వారికి ఇల్లు నిర్మించి, పూర్తి పరిహారం ఇచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుందని చెప్పారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని అనుకుంటున్నారని, కానీ రారని చెప్పారు. చంద్రబాబు అధికారం కోసం ఎవరితోనైనా జతకడతారన్నారు. తాను సీఎం అయ్యేందుకు రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు.