పవన్ కళ్యాణ్ అభినందనలు: లవ్ యూ అంటూ చిరంజీవి
హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడంతో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, చిరంజీవి సోదరుడు, ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా అభినందనలు తెలిపారు.

చిరంజీవి కీర్తి కిరీటంలో మరో వజ్రమంటూ పవన్ కళ్యాణ్
తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య చిరంజీవిని 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 పురస్కారం వరించడంతో ఎంతో సంతోషాన్ని కలిగించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోవ్సవాల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
స్ఫూర్తి అంటూ పవన్ కళ్యాణ్: లవ్ యూ అంటూ చిరంజీవి
నాలుగు దశాబ్దాలకుపైగా సాగుతున్న అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకుని ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
దీనికి చిరంజీవి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలంటూ లవ్ యూ పవన్ కళ్యాణ్ అని బదులిచ్చారు.
కేంద్ర ప్రభుత్వానికి చిరంజీవి ధన్యవాదాలు
ఇది ఇలావుండగా, తనకు అవార్డు ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ప్రేమతోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు ట్వీట్ చేశారు. సినీ పరిశ్రమకు చిరంజీవి అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గోవాలో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ్ల ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించింది.
చిరంజీవిపై అనురాగ్ ఠాకూర్ ప్రశంసలు
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.. చిరంజీవికి అవార్డు వచ్చినట్లు ప్రకటించి అభినందనలు తెలిపారు. 150కిపైగా సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారని ప్రశంసించారు. దీంతో చిరంజీవి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో సినీనటులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications