కెసిఆర్కు పాఠం: 3 వేల మంది రైతులతో పవన్ కళ్యాణ్
హైదరాబాద్: గతంలో తన ఫామ్హౌస్లో దిగుబడి గురించి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పినప్పుడు రాజకీయ నాయకులంతా విస్తుపోవడమే కాకుండా ఆ వ్యవసాయ పద్ధతులేమిటో తెలంగాణ రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం మరో రూపంలో కెసిఆర్కు అటువంటి వ్యవసాయ పద్ధతుల గురించి ఆచరణలో చూపించదలుచుకున్నట్లు కనిపిస్తున్నారు. ఆందుకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో అవతారం ఎత్తబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తెలుగు రైతులు వ్యవసాయం ఖర్చులు పెరిగిపోయి దిక్కుతోచన స్థితిలో కొట్టుమిట్టాడుతున్న స్థితిలో వారికి మార్గం చూపించేందుకు ఆయన సిద్ధపడుతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రైతులు విపరీతమైన పురుగు మందులు వాడుతూ వ్యవసాయ పెట్టుబడి పెరిగిపోవడంతో అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నారనే అభిప్రాయంతో ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి సాధించేందుకు అవలంభించాల్సిన మార్గాలను రైతులకు తెలియజేసేందుకు సేంద్రియ వ్యవసాయం పట్ల అవగాహన పెంచేందుకు విజయరామ్ కర్నూలులో 3 వేల మంది రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ వ్యవసాయ పద్ధతులు, రైతులు అనుసరించాల్సిన విధానాలపై మాట్లాడుతారనే వార్తలు కూడా వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ వ్యవస్యాయ క్షేత్రంలో విజయరామ్
ఏ మాత్ర సమయం దొరికినా హైదరాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ లో గడపడటం పవన్ కళ్యాణ్కు అలవాటు. అక్కడ రకరకాల పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో రసాయనాలతో కూడిన వ్యవసాయమే ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రకృతి ఉద్యమాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. విజయరామ్ అనే వ్యక్తితో కలిసి ఆయన ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు.
రసాయన సేద్యాన్ని విడిచి ప్రకృతి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించడానికి విజయరామ్ తో కలిసి పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. విజయరామ్ సహకారంతో తన ఎనిమిది ఎకరాల సొంత వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల ఆకు కూరలు, పండ్లు, పూల మొక్కల సాగు ప్రారంభించారు.
రసాయనాల అవసరం లేని సేంద్రియ సాగు వ్యవసాయం దగ్గరుండి పవన్ కళ్యాణ్ పరిశీలించే విషయం ఇటీవల వార్తల్లోకి ఎక్కింది. పంట పండిన తర్వాత ఆ రుచులను పవన్ కళ్యాణ్ ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఈ పద్దతిలో పండిన ఆకుకూరలు చిన్న తనంలో నాయనమ్మ వండిపెట్టినపుడు ఎంత రుచిగా ఉన్నాయో అంతే రుచిగా ఉన్నాయని కూడా పవన్ అంటున్నారు.
విజయరామ్ తో కలిసి జీరో బడ్జెట్ వ్యవసాయం పద్దతలను పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ లో ప్రారంభించారు కూడా. సుభా పాలెకర్ జీరో బడ్జెట్ వ్యవసాయం పద్దతిలో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఈ పద్ధతులపై రైతులకు అవగాహన కలిగించాలనేది పవన్ కళ్యాణ్ తదుపరి కార్యక్రమంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications