పవన్ కు బీజేపీ రోడ్ మ్యాప్ - ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం, ఏంటీ లెక్క..!?
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. తాజాగా జనసేనాని పవన్ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ కామెంట్స్ రాజకీయ చర్చగా మారాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఏపీలో ఎన్డీఏ అంటే ఇప్పటి వరకు బీజేపీ - జనసేన మాత్రమే. అదే సమయంలో అమిత్ షాతో భేటీ సమయంలో కీలక నిర్ణయం జరిగిందని పవన్ చెప్పుకొచ్చారు. దీంతో, టీడీపీతో కలిసిన ఎన్డీఏనా..లేక ఈ రెండు పార్టీల కూటమా అనే చర్చ మొదలైంది.
పవన్ కు హామీ దక్కిందా : ఎన్డీఏ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ కు మాత్రమే ఆహ్వానం దక్కింది. టీడీపీని పిలుస్తారనే ప్రచారం సాగినా ఆహ్వానం రాలేదు. ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం తరువాత పవన్ కల్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాతోనూ సమావేశమయ్యారు.

ఢిల్లీ పర్యటనలో టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ దాదాపు తేల్చేసారు. సీఎం పదవి ఎన్నికల సమయంలో తేలుతుందని చెప్పుకొచ్చారు. టీడీపీ- బీజేపీ మధ్య అండర్ స్టాండింగ్ సమస్య ఉందని విశ్లేషించారు. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ తగ్గించే బాధ్యత పవన్ తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఢిల్లీ పర్యటన లోనూ ఆ ప్రయత్నాలు కొనసాగించినట్లు కనిపిస్తోంది.
బీజేపీ - జనసేన కలిసి : ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత పార్టీ కార్యాలయంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. అమిత్ షా తో సమావేశం గురించి పదే పదే ప్రస్తావించారు. ఏపీలో భవిష్యత్ అడుగుల గురించి నిర్ణయం జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. ఏపీలో బీజేపీ, జనసేన బంధం పైన పురందేశ్వరి అటు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. పవన్ కు ఫోన్ చేసి మాట్లాడిన పురందేశ్వరి త్వరలో సమావేశం కావాలని నిర్ణయించారు.
రెండు పార్టీలు కలిసి కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించారు. టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తారనే విధంగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయనే విశ్లేషణలు వస్తున్నాయి. అయితే మూడు పార్టీలు కలవటం సాధ్యం కాకపోతే పవన్ తాను చెప్పినట్లు బీజేపీ-జనసేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయానికే కట్టుబడి ఉంటారా అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి.

ఏపీ లో ఎన్డీఏ ప్రభుత్వం లెక్క వెనుక : పవన్ కల్యాణ్ వైసీపీ టార్గెట్ రాజకీయాలను ముమ్మరం చేసారు. వారాహి యాత్ర ద్వారా నేరుగా సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పైన ఆరోపణలతో కొత్త లక్ష్యం నిర్దేశించుకున్నారు. పవన్ వ్యాఖ్యల పైన సీఎం జగన్ సీరియస్ అయ్యారు. పవన్ వ్యక్తిత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు.
బీజేపీతో పొత్తులో ఉంటూ టీడీపీతో స్నేహం చేస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఏపీ రాజకీయం ఒక విధంగా పవన్ కేంద్రంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కు ఢిల్లీలో ఇచ్చిన రోడ్ మ్యాప్ ఆధారంగానే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ రాజకీయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications