పవన్ కల్యాణ్ సభా వేదికకు ఆ పేరు: కాంగ్రెస్ పులి కల్లూరు
అనంతపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చేనెల 10వ తేదీన అనంతపురంలో తలపెట్టిన రాయలసీమ చైతన్య వేదిక సభా వేదికకు కల్లూరు సుబ్బారావు పేరు పెట్టారు. మైదానికి విప్లవకారుడు తరిమెల నాగిరెడ్డి పేరు పెట్టగా, వేదికకు స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెసువాది కల్లూరు సుబ్బారావు పేరు పెట్టారు.
కల్లూరు సుబ్బారావు కూడా అనంతపురం జిల్లాకు చెందినవారే. తెలుగు, కన్నడ పండితుడూ కవీ, వక్త కూడా. వృత్తిరీత్యా అధ్యాపకుడైన సుబ్బారావు 1920లలో స్వాతంత్య్రోద్యమంలో చేరారు. ఆయన అనంతపురం జిల్లా హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897 మే 25వ తేదీనన సూరప్ప, పుట్టమ్మ దంపతులకు జన్మించారు.
మదనపల్లెలోని జాతీయ కళాశాలలో 12వ తరగతి వరకు చదువుకున్నారు. 17 ఏళ్ల వయసులో అనీబిసెంట్ ప్రసంగంతో ప్రేరణ పొంది జాతీయోద్యమంలో చేరారు. 1920లో జరిగిన ఆంధ్రమహాసభలో పాల్గొని అయ్యదేవర కాళేశ్వరరావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య లతో స్నేహాన్ని పెంచుకున్నారు. 1921లో విజయవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు సమావేశాల్లో స్వచ్ఛందసేవకునిగా పనిచేశాడు.

పలుమార్లు జైలుకు వెళ్ళి, మొత్తం ఏడేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించారు. ఆంగ్లేయులు ఆయనను కాంగ్రెస్ పులి అని అభివర్ణించారు. బాబూ రాజేంద్రప్రసాద్ ఆయనను జైలు పట్టభద్రుడని కొనియాడారు. సుబ్బారావు లోకమాన్య అనే పత్రికకు సంపాదకత్వం వహించారు.
స్వాతంత్ర్యం తర్వాత మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1955లో ఆంధ్రరాష్ట్ర శాసనసభకు, 1965లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు హిందూపూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1955లో శాసనసభ డిప్యూటీ స్పీకరుగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1967లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సుబ్బారావు 1973 డిసెంబర్ 21వ తేదీన మరణించారు.












Click it and Unblock the Notifications