జగ్గారెడ్డికి షాక్: ప్రచారానికి పవన్ దూరం, ఎందుకు..?
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికలో పవన్ కళ్యాణ్చే ప్రచారం చేయించాలని భావిస్తోన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు షాక్ తగిలింది. ఉప ఎన్నిక కోసం పవన్ కళ్యాణ్ ప్రచారానికి రావడం లేదట. ఈ విషయాన్ని బీజేపీకి కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రచారం ద్వారా లబ్ది పొందాలనుకున్న బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి ఆశలు అడియాసలయ్యాయంటున్నారు.
పవన్ను ఉప ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే జగ్గారెడ్డి ఆహ్వానించారట. అయితే తీవ్రమైన వెన్నునొప్పికారణంగా తాను బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాని, ఈ కారణంగా సెప్టెంబర్ 13లోపు తాను హైదరాబాద్ రాలేనని జగ్గారెడ్డికి మెసేజ్ పెట్టారట!

ఇదిలా ఉండగా.. మెదక్ ఉప ఎన్నికలో జగ్గారెడ్డి ప్రచార బాధ్యతలు చూసుకుంటున్న వారుమాత్రం పవన్ కళ్యాణ్ ప్రచారంపై ఇంకా ఆశతోనే ఉన్నారట. పవన్ ప్రచారానికి రావడంలేదన్న సమాచారాన్ని కొట్టిపారేయనప్పటికీ, ఎన్నికల ప్రచార పర్వంలో ఆఖరి రెండు రోజులైనా ఆయనను తీసువచ్చే ప్రయత్నాలు తాము చేస్తున్నారట.
పవన్ కళ్యాణ్ మెదక్ ఉప ఎన్నికల ప్రచారానికి వస్తే సమీకరణాలు మారే అవకాశం ఉందనే ఆలోచనతోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆయనపై హఠాత్తుగా విమర్శల దాడి ప్రారంభించిందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఇప్పుడు పవన్ ప్రచారంపై అనుమానాలు కలుగుతుండటం గమనార్హం. మరోవైపు, హెచ్చరికల వల్లనే పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, అంత సీన్ లేదనే వారు కూడా లేకపోలేదు.












Click it and Unblock the Notifications