పోలవరం నిర్వాసితులపై మానవ హక్కుల ఉల్లంఘనలు: ఏపీ సర్కారుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నలు
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు కోసం ఎన్నో త్యాగాలు చేసినవారిపట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాభావం కలిగి ఉండాలన్నారు. ఈ విషయాన్ని పాలకులు విస్మరించి ముంపు ప్రాంతవాసుల పట్ల అనుసరిస్తున్న వైఖరి బాధ కలిగిస్తోందని అన్నారు.
నిర్వాసితుల పట్ల ఏపీ సర్కారు మానవ హక్కుల ఉల్లంఘన
పోలవరం ముంపు ప్రాంత పరిధిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో అధికార యంత్రాంగం అనుసరించిన దుందుడుకు విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జేసీబీలతో ఇళ్లను కూల్చివేసి విద్యుత్ సరఫరా సహా ఇతర సదుపాయాలను నిలిపివేయడం గర్హనీయమని అన్నారు. పుట్టిపెరిగిన ఊళ్లను, జీవనోపాధిని, సాగుభూమిని వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న గిరిజనులపై ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించడం ఖచ్చితంగా మనావ హక్కుల ఉల్లంఘననేని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
నిర్వాసితులను అప్పుడే తరలించాలి..
తమ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులతో మాట్లాడినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. కంటి తుడుపు కోసం నిర్వాసితులకు పట్టాలు ఇచ్చి ఊరి నుంచి పంపిస్తే వాళ్లు ఎక్కడ తలదాచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నిర్వాసితుల కోసం కాలనీలు నిర్మించి అన్ని సదుపాయాలు కల్పించాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీయువకుడినీ పరిహారం ప్యాకేజీకి అర్హులుగా చేసిన తర్వాతే తరలించాలని డిమాండ్ చేశారు.
నిర్వాసితులకు జగన్ ఏం సమాధానం చెబుతారంటూ పవన్
పోలవరం, ముంపు బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీకింద రూ. 10 లక్షలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన వైఎస్ జగన్.. ఇప్పుడు రూ. 6.8 లక్షలే ఇస్తున్నారని అంటున్న అక్కడి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని పవన్ ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ప్రజల బాధలను జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగాలు చేస్తున్నవారికి జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఇళ్లను కూల్చివేస్తే ఎక్కడికిపోతారు?
పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎన్నో ఏళ్ల కల... ఈ ప్రాజెక్ట్ కోసం తాము పుట్టి జీవిస్తున్న ఊళ్లను, ఇళ్లను, పొలాలను త్యాగం చేసిన ప్రజలను నిర్దాక్షిణ్యంగా రోడ్డునపడవేయడం అత్యంత దురదృష్టకరమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలలో ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించడంలో నిబంధనలను పక్కకుపెట్టి జేసీబీలు, పొక్లైనర్లతో బలవంతంగా ఇళ్లను కూల్చి వేసి మానవ హక్కులను ఉల్లంఘించారన్నారు. నిర్వాసితుల వద్దకు వెళ్లిన నాదెండ్ల మనోహర్ వారిని పరామర్శించారు. వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. జనసేన అండగా ఉంటుందని వారికి చెప్పారు.