సచివాలయాలతో పాటు పంచాయతీల ప్రక్షాళన ? పవన్ కీలక ఆదేశాలు..!
ఏపీలో ఓవైపు గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళనకు, ఉద్యోగుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం చురుగ్గా పావులు కదుపుతోంది. ఇప్పటికే కేబినెట్ లో ఈ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర కూడా వేసింది. అదే సమయంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగిన పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని, దీనికోసం సిబ్బంది లేమి సమస్యను అధిగమించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అధికారులకు స్పష్టం చేశారు. ఇందు కోసం పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని మాత్రమే క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానం చేపట్టారని, కానీ ఇప్పుడు కొత్తగా తనంగా జనాభాను కూడా ప్రాతిపదికగా తీసుకొని పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించాలని సూచించారు.

పంచాయతీల్లో సిబ్బంది నియామకం విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా, సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చూడాలని అధికారులకు పవన్ ఆదేశాలు ఇచ్చారు. ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభాగా ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో పాత క్లస్టర్ వ్యవస్థ వల్ల సిబ్బంది నియామకం విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులపై పవన్ చర్చించారు.
గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకొని కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బందిని నియమించుకోవడంపై పవన్ అధికారులతో చర్చించారు. ఈ విధంగా చేయడం వల్ల మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాలు అమలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతో పాటు గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యత అయిన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదలకు తగినంత మంది సిబ్బంది ఉంటారన్నారు.
వీటిపై అధ్యయనం చేసి పంచాయతీల్లో పరిపాలన సులభతరం చేసేందుకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కమిటీ వేయాలని పవన్ నిర్ణయించారు. కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది.
పంచాయతీరాజ్ శాఖ నుంచి నలుగురు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటవుతుంది. జిల్లా యూనిట్ ప్రాతిపదికన 26 జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకొని జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలను రాష్ట్ర కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లను ప్రభుత్వానికి నివేదిస్తుంది. అనంతరం విభజిస్తారు.












Click it and Unblock the Notifications