త్వరలో ఢిల్లీకి పవన్-చంద్రబాబు విషయంలో బీజేపీతో తాడోపేడో ?
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ సహా తాజా పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలకు ఫిర్యాదుచేసేందుకు సిద్దమవుతున్నారు. త్వరలో ఢిల్లీకి వెళ్లి అన్ని విషయాలపై వివరాలు అందచేస్తానని పవన్ కళ్యాణ్ నిన్న ప్రకటించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రానికి రాకుండా తనను అడ్డుకున్న వ్యవహారంపైనా కేంద్రంలో పెద్దలకు ఫిర్యాదు చేయబోతున్నారు. అలాగే బీజేపీతో పొత్తు వ్యవహారాన్నీ తేల్చుకోబోతున్నారు.
ఇన్నాళ్లూ ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ-బీజేపీ-జనసేనను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేసిన పవన్ కళ్యాణ్ కు తాజాగా చంద్రబాబు అరెస్టు సహా చోటు చేసుకుంటున్న ఇతర పరిణామాలు కూడా మింగుడు పడటం లేదు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టు తర్వాత తనను బేగం పేట ఎయిర్ పోర్టులో అడ్డుకోవడం, ఆ తర్వాత రోడ్డు మార్గంలో ఏపీకి చేరుకునేందుకు ప్రయత్నిస్తే తెలంగాణ సరిహద్దుల్లో అర్ధరాత్రి అడ్డుకోవడం వంటి పరిణామాలపై పవన్ ఆగ్రహం గా ఉన్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఇది దొరకగానే ఢిల్లీకి పయనం కానున్నారు.

చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో టీడీపీ ఇవాళ రాష్ట్రబంద్ కు పిలుపునిచ్చింది. దీనికి జనసేన కూడా మద్దతు ప్రకటించింది. అయితే బీజేపీ మాత్రం ఈ బంద్ కు దూరంగా ఉండిపోయింది. చంద్రబాబు అరెస్టు వరకూ టీడీపీకి మద్దతుగా ఉన్న బీజేపీ నేతలు.. బంద్ విషయంలో మాత్రం దూరంగా ఉండిపోయారు. దీంతో ఈ వ్యవహారం కూడా బీజేపీ-జనసేన పొత్తుపై ప్రభావం చూపబోతోంది. బీజేపీ ఒకవేళ వైసీపీకి మద్దతుగా ఉండాలనుకుంటే ఆ విషయం స్పష్టంగా చెప్పేయాలని పవన్ కోరబోతున్నారు.
అలాగే టీడీపీతో పొత్తు విషయంలోనూ బీజేపీతో తాడోపేడో తేల్చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ప్రయత్నిస్తారని తెలుస్తోంది. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కోసం ఇన్నాళ్లు ప్రయత్నాలు చేసిన పవన్.. ఇప్పుడు చంద్రబాబు విషయంలో బీజేపీ దూరంగా ఉండిపోవడం, ఇంకా చెప్పాలంటే వైసీపీకి పరోక్షంగా మద్దతివ్వడంపై పవన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని ఇదే విషయంపై స్పష్టత కోరబోతున్నారు.












Click it and Unblock the Notifications