23 తర్వాతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రిజిస్ట్రేషన్
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన తన పార్టీ చిహ్నాన్ని విడుదల చేయాలనే జససేన అధినేత పపన్ కళ్యాణ్ ఆలోచనలు ఫలించేట్లు లేవు. పవన్ కళ్యాణ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా స్థాపించిన జనసేన పార్టీ త్వరలోనే ఒక పక్కా రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోనుంది.
జనసేన పార్టీ నమోదు విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోగా తెలియజేయాలని ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన చేసింది. అంటే ఈ నెల 23వ తేదీ తర్వాతనే జనసేన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది.
జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తారని, పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఎమ్మెల్యే కాలనీలోని స్పేస్ వ్యూ, ప్లాట్ నెంబర్: 91 చిరునామాలో ఉన్నట్లు ఈసీకి సమర్పించిన రిజిస్ట్రేషన్ పత్రాల్లో పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత, ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశాలున్నాయి.
తన ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులను ఎంచుకొని వారితో పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోనున్నారు. వారి సహకారంతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరిగే ఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దించాలన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది.