అన్నపూర్ణ లాంటి కోనసీమను ఈ దుస్థితికి తీసుకొచ్చారు: వైసీపీ సర్కారుపై పవన్ కళ్యాణ్ ఫైర్
అమరావతి: ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా ముంపు బాధితుల ఇక్కట్లు రోజురోజుకీ పెరుగుతున్నాయన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వందల గ్రామాల ప్రజలు వరద నీట మునిగి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
బటన్ నొక్కితే బాధ్యత తీరిపోతుందా? అంటూ పవన్
వేల మంది బాధితులు ఉంటే నామమాత్రంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం చూస్తే వైసీపీ ప్రభుత్వం వరద పరిస్థితులపై ఏ మాత్రం అప్రమత్తంగా లేదని అర్థమవుతోందని పవన్ కళ్యాన్ ధ్వజమత్తారు. బటన్ నొక్కితే బాధ్యత తీరిపోయిందని వైసీపీ నాయకత్వం భావిస్తోందని పవన్ ఎద్దేవా చేశారు. మానవత్వంతో స్పందించి సహాయ చర్యలు చేపట్టాలన్నారు.
అందుకే ఈ పరిస్థితులంటూ పవన్ కళ్యాణ్ ఫైర్
అయితే వరద బాధితుల గోడును ఏపీ పాలకులు పట్టించుకోవడం లేదు. బాధితులను ఆదుకోవాలని కోరితే- రాజకీయం చేస్తున్నామని వైసీపీ నాయకత్వం చెప్పడం ద్వారా వైఫల్యాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు కనీసం పడవలు కూడా ప్రభుత్వ సమకూర్చలేకపోయింది. ఆహారం కూడా ఇవ్వలేదు. రెండేళ్ల కిందట వచ్చిన వరదల సమయంలో పడవలు, ఆహారం సమకూర్చినవారికి నేటికీ బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని విమర్శించారు.
అన్నపూర్ణ లాంటి కోనసీమను ఈ దుస్థితికి తెచ్చారంటూ పవన్ కళ్యాణ్
ప్రస్తుతం నీట మునిగిన ఇళ్ళల్లోనే వరద బాధితులుబితుకుబితుకుమంటూ సహాయం కోసం చూస్తున్నారు. పసి పిల్లలకు కనీసం పాలు కూడా అందటం లేదనే విషయం నా దృష్టికి వచ్చింది. అన్నపూర్ణలాంటి కోనసీమ ప్రాంతంలో ఆహార పొట్లాల కోసం పెనుగులాడుకొనే పరిస్థితి కల్పించారని పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. మరోవైపు, జనసేన పార్టీ నేతలు, జన సైనికులు.. ఇప్పటికీ ముంపులో ఉన్న గ్రామాల్లో సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఆహారం, పాలు, కూరగాయలు అందిస్తున్నారు. వారి సేవలు అభినందనీయమని పవన్ కళ్యాణ్ ప్రశసించారు.