ముద్రగడ పద్మనాభంతో తోట టీమ్ టాక్స్: పవన్ కళ్యాణ్ చొరవే...
హైదరాబాద్: నిజానికి, కాపు రిజర్వేషన్ల కోసం ఆందోళనకు దిగిన కాపు నేత ముద్రగడ పద్మనాభంతో చర్చలు చేయడానికి వాస్తవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన విముఖతతో ఉన్నారు. కానీ అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీ నేతలు ముగ్గురు గురువారం రాత్రి ఆయనతో చర్చలు జరిపారు. తాము ప్రభుత్వం తరఫున రాలేదని, చంద్రబాబు తమను పంపించలేదని వారు చెప్పారు.
కానీ, వారు ముద్రగడతో చర్చలు జరపడం వెనక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సలహా పనిచేసినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తోట త్రిమూర్తులుకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహానే ఆ చర్చలకు దారి తీసినట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటను కాదనలేక చంద్రబాబు ఓ అనధికారిక బృందం చర్చలకు అంగీకరించినట్లు చెబుతున్నారు.
తోట త్రిమూర్తులు, బొండా ఉమామహేశ్వరరావు, బొడ్డు భాస్కరరావు గురువారం రాత్రి ముద్రగడ పద్మనాభంతో చర్చించారు. పవన్ కళ్యాణ్ కారణంగానే తోట త్రిమూర్తులు ఇందులో ప్రధాన పాత్ర పోషించారని అంటున్నారు. అయితే, పనిలో పనిగా బొండా ఉమామహేశ్వర రావు పేరును చంద్రబాబు సూచించినట్లు చెబుతున్నారు.
ఆందోళనకు దిగిన ముద్రగడ పద్మనాభంతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. దాంతో చంద్రబాబు కాస్తా దిగి వచ్చి అనధికారికంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ముద్రగడ వద్దకు వెళ్లడానికి అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
ముద్రగడ డిమాండ్లను తాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శుక్రవారంనాడు వినిపిస్తామని, ఆయన స్పందన ఎలా ఉంటుందో చూసి మళ్లీ ముద్రగడ వద్దకు వస్తామని ఆ ముగ్గురు నాయకులు కూడా గురువారం రాత్రి చెప్పారు. అయితే, వారు ఏ మేరకు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారో తెలియదు గానీ ముద్రగడ పద్మనాభం మాత్రం శుక్రవారం ఉదయం దీక్షను ప్రారంభించారు.