పవన్ కళ్యాణ్: మోడీకి మద్దతు, పోటీపై వెనక్కి
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి బేషరతు మద్దతు ప్రకటించారు. విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో ఇజం పుస్తకాన్ని విడుదల చేసి ఆయన గురువారం సాయంత్రం ప్రసంగించారు. మోడీని తాను కలవడంపై వచ్చిన విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. యుపిఎ విధానాలతో విసిగిపోయి మోడీని కలిసినట్లు ఆయన తెలిపారు. కచ్చితంగా మాట్లాడే నాయకుడు దేశానికి కావాలని, దేశాన్ని ఉత్తేజపరిచి ముందుకు నడిపించే నేత కావాలని, ఆ లక్షణాలు తాను మోడీలో చూశానని, అందుకే తాను మోడీని కలిశానని ఆయన చెప్పారు.
తాను 25 నుంచి 28 లోకసభ స్థానాలకు, 90 నుంచి 96 శాసనసభ స్థానాలకు పోటీ చేయాలని అనుకున్నానని, అయితే ఓట్లను చీల్చడం ఇష్టం లేక పోటీ చేయడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని, రాజధానిని ఎవరు నిర్మించగలరో వారిని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. తాను ఏదో ఒక్క పార్టీకి ఓటేయాలని అడగడం లేదని అన్నారు.

పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేస్తే మాట్లాడిన నేతలు లేరని, వారికి ఆ ధైర్యమూ దమ్మూ లేవని, ఆ దమ్మూ ధైర్యమూ ఉన్నాయని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో మోడీ కచ్చితంగా మాట్లాడారని, అందుకే మద్దతు పలికానని ఆయన చెప్పారు. తెలంగాణకు మోడీ మద్దతు కావాలి గానీ తాను కలిస్తే తప్పా అని అడిగారు. మోడీకి భయాలు లేవని, అందుకే తాను కలిశానని చెప్పారు. మోడీని ప్రధానిగా చూడాలని తాను చెప్పానని ఆయన అన్నారు.
నిజాయితీ కలిగి సమాజ సేవ చేసే యువకుల కోసం తాను అన్వేషిస్తున్నానని, అటువంటి యువకులు దొరికినప్పుడు తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన అంశాన్ని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పదే పదే ప్రస్తావించారు. విభజనను వ్యతిరేకించడం లేదని, విభజన జరిగిన తీరును వ్యతిరేకిస్తున్నానని ఆయన అంటూ వచ్చారు. అయితే, రాష్ట్రాన్ని కలుపగలిగే రాజకీయ నాయకులు కావాలని ఆయన తన ప్రసంగం చివర అన్నారు.
కాంగ్రెసు పార్టీని ఓడించాలని మాత్రం ఆయన స్పష్టంగానే చెప్పారు. అన్నయ్య చిరంజీవి, తాను చెరో వైపు ఉండడం దైవలీల అని ఆయన అన్నారు. "సముద్రం ఒకరి కాలి దగ్గర కూర్చొని మొరగదు. తుపాన్ ఒకరికి చిత్తం అంటూ ఎరగదని, పర్వతం ఎవరికీ వొంగి సలాం చేయదని, నేనంతా కలిపి పిడికెడు మట్టే కావచ్చు, మనమందరం కలిసి పిడికెడు మట్టే కావచ్చు, కానీ మనం చేయిత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉందని, అదే పది కోట్ల మంది తెలుగువాళ్లు ఒక్కసారి ఏకమై గొంతెత్తితే.. తెలుగు జాతిని విభజించిన కాంగ్రెస్ హైకమాండ్ను మట్టిలో కలిపేయవచ్చున"ని పవన్ కల్యాణ్ అన్నారు.












Click it and Unblock the Notifications