తల్లిని తిప్పుతారా, తొక్కేస్తాం: జగన్పై పవన్, హెచ్చరిక
కాకినాడ: ముఖ్యమంత్రిగా అయ్యేందుకు కన్నతల్లిని ఎండలో తిప్పేవారు అధికారంలోకి రాలేరని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి శుక్రవారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు డబ్బులు పంచితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకొని ఓట్లు మాత్రం టిడిపి, బిజెపి అభ్యర్థులకు వేయాలన్నారు. తాను ఇప్పుడు కేవలం ఓట్లు అడిగేందుకు మాత్రమే రాలేదని... తర్వాత కూడా గట్టిగా ప్రజల కోసం ఉద్యమిస్తానని చెప్పారు.
జనసేన అంటే చేతిలో ఆయుధాలు ఉండవని చెప్పారు. అక్రమార్కులను తొక్కుకుంటూ వెళ్తుందని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, జగన్ సన్నిహితుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి పవన్ హెచ్చరికలు జారీ చేశారు. కడప, పులివెందుల తరహా దౌర్జన్యాలు ఇక్కడ ఆపాలన్నారు. ద్వారంపూడి పేదల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు.
సెజ్ భూసేకరణ పైన తాను బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడానని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మేరకే భూసేకరణ చేయాలని సూచించినట్లు తెలిపారు. సీమాంధ్ర ప్రాంతం నుండి పిల్ల కాంగ్రెసును తరిమేయాలన్నారు.
జగన్ పైన సోమిరెడ్డి నిప్పులు
జగన్ పైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. వైయస్ మృతి పైన అనుమానాలు ఉన్నాయని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, దాని పైన సిబిఐ విచారణను ఎందుకు డిమాండ్ చేయడం లేదన్నారు. సోనియా అల్లుడు రాబర్డ్ వాద్రా పైన జగన్ పార్టీ ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు. మోసగాడైన కోలా కృష్ణమోహన్ను జగన్ శిఖండిలా వాడుకుంటున్నారన్నారు. ఓ చీటర్తో ఆయన ఆరోపణలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు.