పవన్ టి టూర్: జగన్ పార్టీ హెచ్చరిక, బాబు ఓ గార్డ్లా..
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతుగా తెలంగాణలో శుక్రవారం నుండి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్ కృష్ణయ్యతో కలిసి పవన్ ప్రచారంలో పాల్గొంటారు. తొలి విడతగా తెలంగాణలోని 45 నియోజకవర్గాల్లో, ఆ తర్వాత సీమాంధ్రలో కూడా పవన్ ఎన్డీఎ కూటమికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
ఈ నెల 27న సిరిసిల్ల, హుస్నాబాదులో, 28న పాలకుర్తిలో పవన్ ప్రచారం చేస్తారు. రేపటి నుంచి హైదరాబాద్, సికింద్రాబాదులో రెండురోజుల పాటు ప్రచారం చేస్తారు. కాగా, మల్కాజిగిరి ఎంపి అభ్యర్థిగా బిజెపి బలపరిచిన తనకు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం సంతోషకరమని టిడిపి అభ్యర్థి సిహెచ్ మల్లారెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్కు మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
నోరు అదుపులో పెట్టుకో: గట్టు
వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పవన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని గట్టు రామచంద్ర రావు హెచ్చరించారు. తొమ్మిది సంవత్సరాలు పాలించిన చంద్రబాబు సినీ నటుడు పవన్ ఇంటికి వెళ్లి మాట్లాడడం, పవన్ విలేకర్లతో మాట్లాడుతున్నంత సేపు సెక్యూరిటీ గార్డ్ మాదిరిగా బాబు నిలబడడం చూస్తే జాలి వేసిందన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం వైయస్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. తమ పార్టీ మ్యానిఫెస్టోను విమర్శించే బదులు చంద్రబాబు అభివృద్ధికి ఏమి చేయబోతున్నారో తెలియచేయాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే అభద్రతాభావనతో చంద్రబాబు ఉన్నారన్నారు. పవన్కు ఒక ప్లాట్ఫారం కావాలని, దీనిని బిజెపి కల్పించిందన్నారు. గత ఎన్నికల్లో బాబు మహాకూటమి ఏర్పాటు చేసినా గెలవలేకపోయారన్నారు. టిడిపిని ఎన్టీఆర్ స్ధాపిస్తే ఆ పార్టీ నిండా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారు.