సత్తా లేదు: విభజనపై పయ్యావుల, ఇప్పుడొద్దు: శైలజ
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్లే స్తాత కాంగ్రెసుకు లేదని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. శానససభ ముందుకు తెలంగాణ బిల్లు వచ్చినంత మాత్రాన చర్చకు వచ్చినట్లు కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ దశలో రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్రాన్ని విభజించడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల్లో సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ప్రజలను అయోయమానికి గురి చేస్తున్నారని పయ్యావుల అన్నారు. శాసనసభకు దిశానిర్దేశం చేసే హక్కు రాష్ట్రపతికి కూడా లేదని ఆయన చెప్పారు. శాసనసభ సమావేశాలకు కచ్చితంగా విరామం ఇవ్వాల్సిన అవసరం ఉందని, విభజన ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలని రాయలసీమకు చెందిన ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ అన్నారు. ప్రస్తుత సమావేశాలు వరదలతో పాటు ప్రజాసమస్యలను చర్చించడానికి ఏర్పాటు చేసినవని, అందువ్ల వాటిపైనే చర్చ జరగడం మంచిదని ఆయన అన్నారు. బిల్లులోని అంశాలను ప్రజలకు తెలియజేసి వారితో చర్చించిన తర్వాతనే అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లుపై తప్పనిసరిగా ఓటింగు జరపాలని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బిల్లుపై శాసనసభలో ఓటింగు అవసరం లేదన్న దిగ్విజయ్ సింగ్ మాటలపై ఆయన స్పందించారు. కేవలం అభిప్రాయం తెలుసుకునేందుకే అయితే బిల్లును శాసనసభకు పంపించడం ఎందుకని ఆయన అడిగారు.
గతంలో సంప్రదాయాలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజిస్తున్నందు వల్ల దానిపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలని ఆయన అన్నారు. రాష్ట్రపతి 40 రోజల సమయం ఇచ్చినందుకు ప్రత్యేక శాసనసభా సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లుపై చర్చించాలని ఆయన అన్నారు.