కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఎమ్మెల్సీల డిమాండ్
అమరావతి:రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు యండపల్లి శ్రీనివాసుల రెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమంపై శుక్రవారం శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా వారు ఈ ఢిమాండ్ చేశారు.
శాసనమండలిలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంలో, వేతనాలు పెంచడంలోనూ ప్రభుత్వం అత్యంత నిర్లక్షంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడీ ఉద్యోగాలు చేస్తున్నా వారికి కనీస ఉద్యోగ భద్రతకు కూడా నోచుకోవడం లేదని అన్నారు. వీరంతా చాలీ చాలని వేతనాలతో దుర్భర జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు.
అందులోనూ అన్యాయమే...ఎమ్మెల్సీ ఆవేదన
అసలు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది ఉన్నారనే సంఖ్య నిర్ధారించే విషయంలో సైతం ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని యండపల్లి చెప్పారు. రాష్ట్రంలో సుమారు 3.05 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే...ప్రభుత్వం మాత్రం కేవలం 49,678 మంది మాత్రమే ఉన్నట్లుగా చెపుతోందని, ఇదేం అన్యాయమని ప్రశ్నించారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో ఐదేళ్లకు పైగా పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులనే రెగ్యులరైజ్ చేసిన విషయాన్ని యండపల్లి గుర్తుచేశారు.
ఎన్నికల హామీ...కబుర్లు వద్దు
2014 ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను టిడిపి తమ అజెండాలో పేర్కొందని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవేవో కల్లబొల్లి కబుర్లు చెపుతోందని విమర్శించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏకంగా ఉత్తర్వులే విడుదల చేసిందని, అయితే ఇక్కడ టిడిపి ప్రభుత్వం మాత్రం కమిటీ పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
అసలు...సమస్య ఏంటి?
అనంతరం మరో పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరణకు ఎదురవుతున్న సమస్యలేంటో ప్రజలకు చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు వీరిని రెన్యువల్ చేసే సమయంలోనే అనేక సమస్యలు సృష్టిస్తున్నారని...ఈ క్రమంలో కొంత మందికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా వారికి అన్యాయం జరగకుండా నివారించి ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలన్నారు.
ఇతర సమస్యలు...అన్నీ పరిష్కరించడండి
ఇఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించడం, అవి సరిగ్గా అమలయ్యేలా చూడటం చేయాలన్నారు. అలాగే సెలవుల విషయంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులైన మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, వీటిని పరిష్కరించాలన్నారు.