నోట్ల సంచీ: మంత్రి పీతల సుజాతపై చంద్రబాబు సీరియస్
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఇంటి ఆవరణలో పది లక్షల రూపాయలతో ఓ నోట్ల సంచీ బయటపడిన విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు గ్రామంలో తన పర్యటన సందర్భంగా చంద్రబాబు పీతల సుజాతను పట్టించుకోలేదు.
సుజాత చంద్రబాబుతో మాట్లాడడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆమె మాటలను పట్టించుకోకుండా ఆయన ముందుకు వెళ్లిపోయారు. గురువారంనాడు చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
కాగా, నోట్ల కట్టల సంచీపై దర్యాప్తులో పోలీసులు కొంత ప్రగతి సాధించినట్లు తెలుస్తోంది. విష్ణువతి అనే మహిళ ఆ సంచీని వీరవాసరంలో మంత్రి నివాసంలో మరిచిపోయినట్లు చెబుతున్నారు. దీంతో పోలీసులు విష్ణువతి బ్యాంకు ఖాతాలను పరిశీలించారు.
పదవీ విరమణ సమయంలో తనకు వచ్చిన డబ్బులను ఆమె ఆ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు, మరికొంత పాలకొల్లు బ్యాంకు నుంచి రుణంగా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ డబ్బుతో తాను భూమి కొనుగోలు చేయాలని అనుకున్నానని, ఈ విషయంలో మంత్రి సుజాత తండ్రి బాబ్జీ సలహా తీసుకోవడానికి వెళ్లాలనని విష్ణువతి చెబుతున్నారు.