అమరావతిలో అమెరికా అధ్యక్షుడు: వినూత్న పద్ధతిలో నిరసన తెలిపిన రాజధాని రైతులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఉంటాయన్న ప్రభుత్వ ప్రకటన చేసిన నాటి నుంచి అమరావతిలో నిరసనలు మిన్నంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా అమరావతి రాజధాని ప్రాంత రైతులు వినూత్న పద్ధతిలో తమ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా దేశం మొత్తం దృష్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనపై ఉండగా... ట్రంప్ కూడా దృష్టి సారించేలా అమరావతి రైతులు వినూత్న పద్ధతిలో నిరసనలు చేపట్టారు.
Recommended Video
వినూత్న పద్ధతిలో అమరావతి రైతుల నిరసన
ఏపీ రాజధాని ప్రాంత రైతులు గత కొద్దిరోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఎందుకని ప్రశ్నిస్తూ వినూత్న పద్ధతిలో నిరసనలు తెలుపుతున్నారు. ఇక అమరావతి నుంచి విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలి వెళుతుందన్న ప్రకటన రాగానే అమరావతి రాజధాని ప్రాంత రైతులు ఏకంగా రోడ్డెక్కారు. వారి నిరసనలు మిన్నంటాయి. అదే సమయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు రైతులకు అండగా నిలవడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం దిగిరాలేదు. ముందుగా అనుకున్నట్లుగానే మూడు రాజధానుల కాన్సెప్ట్తోనే ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే రోజుకో పద్ధతిలో రైతులు తమ నిరసన తెలుపుతున్నారు.
ట్రంప్ ఫ్లకార్డులతో నిరసనలు
తాజాగా దేశం మొత్తం చూపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన వైపు ఉండగా... తమవైపు కూడా అటెన్షన్ ఉండేలా వినూత్న పద్ధతిలో అమరావతి రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అమరావతిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఇదేంటి అమరావతి రైతులకు ట్రంప్ ఫ్లకార్డులకు సంబంధం ఏంటని అనుమానం కలగొచ్చు. భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు స్వాగతం పలుకుతూ ఫ్లకార్డులను ప్రదర్శిస్తూనే మరోవైపు తన బాధను ఫ్లకార్డుల ద్వారా వ్యక్త పరిచారు.
ట్రంప్ సేవ్ అమరావతి అంటూ ఫ్లకార్డుల ప్రదర్శన
రాజధాని తరలింపుపై నిరసన తెలుపుతున్న అమరావతి రాజధాని ప్రాంత రైతులు ట్రంప్ ఫ్లకార్డులను ప్రదర్శించారు. వెల్కమ్ ట్రంప్ అని రాసి ఉన్న ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ అదే సమయంలో అమెరికాకు రాజధాని ఒక్కటే అని జగన్ ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ప్రతిపాదించారని రాసి ఉన్న ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఇలాంటి వినూత్న పద్ధతిలో నిరసన తెలుపుతున్న అమరావతి రాజధాని ప్రాంత రైతులను కెమెరాలు క్లిక్మనిపించాయి.