కొడాలి నాని - రాధా ఛాయ్ పే చర్చ : గుడివాడలో ఆటోలో ముచ్చట్లు : క్లారిటీ వచ్చినట్లేనా..!!
ఆ ఇద్దరు నేతలు ఎప్పుడు కలిసినా చర్చే. ఎన్ని సార్లు కలిసినా ఆసక్తి కరమే. మంత్రి కొడాలి నాని.. వంగవీటి రాధా ఇప్పుడు మరోసారి కలిసారు. ఇద్దరూ గుడివాడ నడి బొడ్డున ఒక ఆటోలో చాయ్ పే చర్చ చేయటం వైరల్ అవుతోంది. కొడాలి నాని.. వంగవీటి రాధా రాజకీయాలకు అతీతంగా మంచి మిత్రులు. రాధాను ఎలాగైనా తిరిగి వైసీపీలోకి తీసుకురావాలని మంత్రి కొడాలి నాని ..వల్లభనేని వంశీ చాలా రకాలుగా ప్రయత్నాలు చేసారు. 2019 ఎన్నికల ముందు వరకూ రాధా వైసీపీలోనే ఉన్నారు. ఇప్పుడు గుడివాడలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వీరిద్దరి వరస భేటీలతో ఆసక్తి కరంగా మారుతున్నాయి.

రాధా టీడీపీలోనే కొనసాగుతారా
అయితే, విజయవాడ సెంట్రల్ సీటు గురించి హామీ దక్కలేదు. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలంటూ వైసీపీ అధినాయకత్వం సూచించింది. దీంతో..వంగవీటి రాధా వైసీపీకి దూరమయ్యారు. టీడీపీలో చేరారు. కానీ, ఆయనకు టీడీపీలో ఎటువంటి పదవులు దక్కలేదు. ఇక, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాధా మిత్రుడు కొడాలి నాని మంత్రి అయ్యారు. రాధాను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చి.. తగిన గుర్తింపు ఇచ్చేలా సీఎం వద్ద ప్రతిపాదించినట్లు పార్టీలో ప్రచారం సాగింది. ఇదే సమయంలో తన పైన రెక్కీ జరిగిందంటూ రాధా సంచలన ఆరోపణలు చేసారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలానికి కారణమైంది.

వేగంగా స్పందించిన చంద్రబాబు
ప్రభుత్వం వెంటనే ఆయనకు భద్రత కల్పించాలని ఆదేశించింది. వైసీపీ మరోసారి రాధాను దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు చేస్తుందని గ్రహించిన చంద్రబాబు వేగంగా అడుగులు వేసారు. గతంలో ఎన్నడూ లేని విధంగా..నేరుగా రాధా నివాసానికి వెళ్లారు. రాధాతో పాటుగా ఆయన తల్లి రత్నకుమారితోనూ సమావేశమయ్యారు. పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. దీంతో..రాధా తిరిగి వైసీపీలోకి వస్తారనే ప్రచారానికి బ్రేకులు పడ్డాయి. ఇక, రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాల కోసం రాధా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ వేదికగా జరిగిన కాపు ముఖ్య నేతల సమావేశంలోనూ పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా జరిగిన కాపు నేతల సమావేశంలో మాజీ మంత్రులు గంటా, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారితో కలిసి వేదిక పంచుకున్నారు.

తరచూ గుడివాడ పర్యటనలతో
ఇక, తరచూ గుడివాడలో పర్యటనలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గుడివాడకు రాధా వెళ్లిన సమయంలో వైసీపీ నేతలే ఆయనకు స్వాగతం పలికారు. ఇప్పుడు, గుడివాడ కు చెందిన అడపా వెంకట రమణ హఠాన్మరణం చెందారు. ఆయన అంతిమయాత్ర గుడివాడలో జరిగింది. ఇందు కోసం అక్కడకు వచ్చిన మంత్రి కొడాలి నాని.. వంగవీటి రాధా ఇద్దరూ ఒక ఆటోలో సాదాసీదాగా టీ తాగుతూ ఛాయ్ పే చర్చ నిర్వహించారు. మంత్రి హోదాలో ఉన్న కొడాలి నాని..తన స్నేహితుడు వంగవీటి రాధాతో కలిసి సాదాసీదాగా ఒక ఆటోలో టీ తాగుతూ ముచ్చటిస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొడాలి బాధ్యత తీసుకున్నారా
అయితే, రాధా 2024 ఎన్నికల లోగా తాను టీడీపీలోనే కొనసాగుతారా..లేక, మనసు మార్చుకొని మిత్రుడు సూచన మేరకు వైసీపీ కండువా కప్పుకుంటారా అనేది మాత్రం ఆసక్తి చర్చగానే కొనసాగుతూనే ఉంది. దీని పైన త్వరలోనే క్లారిటీ వస్తుందని ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతుండటం కొత్త సమీకరణాలకు కారణం అవుతోంది. రాధాను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చే బాధ్యత మంత్రి కొడాలి నాని తీసుకున్నారా అనే చర్చ ఇంకా కంటిన్యూ అవుతోంది. దీంతో..రానున్న రోజుల్లో వంగవీటి రాధా రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications