ఒత్తిడితోనే డిఎస్పీ సురేష్ రావు ఆత్మహత్య (ఫొటోలు)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాజీ భద్రతాధికారి సురేష్రావు ఖైరతాబాద్లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ విభాగంలోని తన గదిలో శుక్రవారం సాయంత్రం సర్వీస్ పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒత్తిడి కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఒత్తిడితో, అనారోగ్యంతో అతను బాధపడుతున్నారు. దీంతో ఉద్యోగం మానేయాలని కూడా కుటుంబ సభ్యులు ఆయనకు సలహా ఇచ్చినట్లు సమాచారం.

నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్రెడ్డి, ఐఎస్డబ్లూ ఐజీ మహేశ్ భగవత్, నగర అదనపు కమిషనర్ అంజనీకుమార్ నిమ్స్ ఆస్పత్రికి తరలివచ్చారు.కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం దండెపల్లి గ్రామానికి చెందిన సురేష్రావు 1991లో ఏపీఎస్పీ విభాగంలో ఆర్ఎస్ఐగా చేరారు. కొంతకాలం ఏపీఎస్పీలోను, అనంతరం గ్రేహౌండ్స్లో పనిచేశారు.
గడచిన 8 సంవత్సరాలుగా ప్రముఖుల భద్రతను చూసే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో అసిస్టెంట్ కమాండెంట్ (డీఎస్పీ) హోదాలో పనిచేస్తున్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన వద్ద భద్రత అధికారిగా పనిచేశారు. గత నెల అనారోగ్యానికి గురికావడంతో సెలవుపై వెళ్లారు. జూలై 19 నుంచి 30 వరకు నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. 31న తిరిగి విధుల్లో చేరారు.

అప్పటినుంచి ఆయన రోజూ ఖైరతాబాద్లోని ఐఎస్డబ్ల్యూ కార్యాలయానికి వస్తున్నారు. ఆయన కార్యాలయం భవనం మొదటి అంతస్తులో ఉంది. శుక్రవారం విధులకు హాజరైన ఆయన 4.05 గంటల ప్రాంతంలో సర్వీస్ పిస్టల్తో కణతపై కాల్చుకున్నాడు.
కుర్చీలో రక్తపు మడుగులో సురేష్ రావు కుప్పకూలి కనిపించాడు. వెంటనే అడ్మిన్ విభాగం అడిషనల్ ఎస్పీ.శివారెడ్డి, డీఎస్పీలు విద్యాసాగర్ తదితరులు ఆయనను పోలీస్ వాహనంలో నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న భార్య కవిత, కుటుంబసభ్యులు హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications