చంద్రబాబు, పవన్ సమర్దతకు ప్రధాని మోదీ పరీక్ష..!!
ఏపీలో ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరింది. పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రచారంలో పార్టీల అధినేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీలో ప్రచారానికి వస్తున్నారు. ఇదే సమయంలో పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో ఎన్ని సీట్లు గెలుస్తామే అంశం పైన ఆరా తీస్తోంది. బీజేపీకి ఎంపీ సీట్లు కీలకం. దీంతో..ప్రధాని మోదీ 400 ఎంపీ సీట్ల టార్గెట్ లో చంద్రబాబు, పవన్ కు బిగ్ టాస్క్ అప్పగించారు. అదే ఇప్పుడు వారి సమర్దతకు పరీక్షగా మారుతోంది.
మారుతున్న లెక్కలు
ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీ 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ పోటీ చేస్తున్న ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ మూడు పార్లమెంట్ సెగ్మెంట్లలో రెండు రోజుల పాటు పర్యటన చేయనున్నారు. మే 6న మధ్యాహ్నం రాజమండ్రి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.45 గంటల విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం అనకాపల్లిలో సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాల్సిందిగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 8న రాజంపేట పార్లమెంట్, అదే రోజు సాయంత్రం విజయవాడలో జరిగే రోడ్ షోలోప్రధాని పాల్గొంటారు.

బీజేపీకి కీలకం
ప్రధానితో పాటుగా ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్ పాల్గొంటారు. ఏపీలో మూడు పార్టీల కలయికతో రాష్ట్రంలో అధికారంలోకి రావటంతో పాటుగా మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుస్తామని పొత్తు సమయంలో బీజేపీ నేతల వద్ద చంద్రబాబు, పవన్ చెప్పుకొచ్చారు. వైసీపీ పైన ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని..కూటమికి పట్టం కడతారని విశ్లేషించారు. ఇక..ఇప్పుడు బీజేపీ పోటీ చేస్తున్న ఆరు ఎంపీ స్థానాలతో పాటుగా మెజార్టీ ఎంపీ సీట్లు గెలిపించటం చంద్రబాబు, పవన్ సమర్థతకు పరీక్షగా నిలుస్తుంది. దేశ వ్యాప్తంగా 400 సీట్లలో గెలవాలని మోదీ లక్ష్యంగా ఫిక్స్ చేసుకున్నారు. దీంతో..కూటమి పార్టీలు మెజార్టీ ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని ఇచ్చిన టాస్క్ లో చంద్రబాబు, పవన్ తమ సత్తా చాటుకోవాల్సి వస్తోంది.

సమర్ధతకు పరీక్ష
కేంద్రంలో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మెజార్టీ తగ్గినా ఎన్డీఏ ప్రభుత్వం ఖాయమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం ఎంత ముఖ్యమో..బీజేపీతో సత్సంబంధాలు అంతే అవసరమనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే, బీజేపీ పోటీ చేస్తున్న ఆరు ఎంపీ స్థానాల్లో ఆ పార్టీ గెలిచే సీట్లు..దక్కించుకొనే ఓట్లు...రెండు పార్టీల నుంచి ఓట్ల బదిలీ కీలకం కానుంది. బీజేపీ అభ్యర్దుల గెలుపు కోసం చంద్రబాబు, పవన్ చేసిన ప్రయత్నాలు బీజేపీ పరిగణలోకి తీసుకోనుంది. దీంత..మూడు పార్టీల కలయిక తో బలమైన కూటమిగా చెబుతున్న సమయంలో సాధించే సీట్లు ఇప్పుడు కేంద్రం వద్ద చంద్రబాబు, పవన్ సమర్థకు కొలమానంగా మారనుంది.












Click it and Unblock the Notifications