చంద్రబాబు హామీపై మోదీ కీలక వ్యాఖ్యలు - వాట్ నెక్స్ట్..!!
ఏపీ, తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపు పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తామని మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో అధికారంపైన టీడీపీ కూటమి, వైసీపీ విశ్వాసంతో ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణలో ఇచ్చిన హామీలను ఏపీలో టీడీపీ ప్రస్తావించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల పైన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు.
ఉచిత బస్సు ప్రయాణం
కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన హామీ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చింది. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. టీడీపీ ఇచ్చిన హామీలకు పవన్ మద్దతిచ్చారు. బీజేపీ తమ మద్దతు ఉంటుందని చెప్పినా..మేనిఫెస్టో మాత్రం టీడీపీ,జనసేనది మాత్రమేనని స్పష్టం చేసారు. టీడీపీ మేనిఫెస్టో సమయంలో బీజేపీ తీరు చర్చకు కారణమైంది.

ప్రధాని మోదీ వ్యాఖ్యలు
ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ పైన ప్రధాని తాజాగా స్పందించారు. బస్సు ప్రయాణాన్ని (మహిళలకు) ఉచితం చేశారు. మెట్రోను ఖాళీ చేశారు. మరిప్పుడు మెట్రో ఎలా నడుస్తుంది.. దేశం ఎలా ముందుకు సాగుతుంది అంటూ ప్రధాని మోదీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై పరోక్ష విమర్శలు చేశారు. ఈ పథకం వల్ల ట్రాఫిక్కు, పర్యావరణానికీ ఇబ్బందులు కలుగుతాయని వ్యాఖ్యానించారు.అసలు.. ఎన్నికల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసే హక్కు ఎవ్వరికీ లేదని ఆయన తేల్చిచెప్పారు.

ఏపీలో టీడీపీ హామీతో
రేవంత్ సర్కారు 'మహాలక్ష్మి' పేరిట ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల హైదరాబాద్ మెట్రోకు నష్టాలు వస్తున్నందున 2026 తర్వాత మెట్రోను విక్రయించే యోచన ఉందని ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ శంకర్ రామన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒక నగరంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి తెస్తారు. అంతలోనే.. ఎన్నికల్లో గెలవడం కోసం మహిళలకు ఉచిత బస్సు పథకం హామీ ఇస్తారని వ్యాఖ్యానించారు.అంటే.. మెట్రో ప్రయాణికుల్లో 50 శాతాన్ని తగ్గించేసినట్టేనిని మోదీ పేర్కొన్నారు. ఏపీలోనూ బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఇదే హామీ ఇవ్వటంతో ఇప్పుడు ఏపీలో ఈ అంశం పైన చర్చ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications