చంద్రబాబుకు కేంద్రం ఊరట!: పోలవరం ప్రాజెక్టుకు నిధులు, మిగతావి త్వరలో
అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట కల్పించింది. మూడు రోజుల క్రితం రూ.1400 కోట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ గురువారం దీనిపై భిన్నమైన ప్రచారం జరిగింది. ఏపీకి మొండిచేయి చూపిందని వార్తలు వచ్చాయి.
కానీ ఈ నిధులను విడతలవారీగా కేంద్రం విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా రూ.1400 కోట్లలో తొలి విడతలో రూ.1098 కోట్లు విడుదల చేసింది. మిగతా రూ.302 కోట్లు మరో విడుతలో విడుదల చేయనుంది. నాబార్డు ద్వారా రూ.1400 కోట్లు రుణంగా తీసుకునేందుకు ఏపీకి కేంద్రం అనుమతించింది.
Recommended Video


మిగతా రూ.302 త్వరలో
పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మొదటి విడతగా రూ.1098 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో తొలి విడతగా దీనిని విడుదల చేశారు. మరోవైపు, మిగతా రూ.302 కోట్లు రావని ప్రచారం జరిగినప్పటికీ అవి కూడా త్వరలో రానున్నాయి.

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు
గత కొద్ది రోజులుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో పోరాటం చేస్తోన్న విషయం తెలిసిందే. కేంద్రం మాత్రం హామీలకు పదేళ్ల సమయం ఉందని, ఒక్కటొక్కటి నెరవేరుస్తున్నామని చెబుతోంది.

బీజేపీపై ఆరోపణలు
ప్రత్యేక హోదాపై గత నాలుగేళ్లలో పలుమార్లు మాటలు మార్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక బీజేపీపై విమర్శలు ఎక్కుపెడుతోన్న విషయం తెలిసిందే. వైసీపీ, జనసేనతో కుమ్మక్కైన బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు జీవనాడి పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.

టీడీపీ ఉద్యమం ఉధృతం
విభజన సందర్భంగా ఇచ్చిన హామీల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ఇటీవల తన దూకుడును క్రమంగా పెంచుతోంది. కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసిన టీడీపీ, ఎన్డీయే నుంచి కూడా బయటకు వచ్చి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, అమరావతికి నిధుల కోసం పోరు ఉద్ధృతం చేసింది.












Click it and Unblock the Notifications