హిమబిందుపై రేప్, హత్య మళ్లీ మిస్టరీయే: తీర్పుపై భర్త నో కామెంట్
విజయవాడ: బ్యాంక్ మేనేజర్ భార్య హిమబిందు హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హిమబిందుపై దండగులు అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితులను మహిళా సెషన్స్ కోర్టు మంగళవారం నిర్దోషులుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, హిమబిందు కేసులో నేరస్తులు ఎవరనేది ఇప్పుడు ప్రశ్నార్తకంగా మారింది.
అరెస్టయిన వ్యక్తుల వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు సాగింది తప్ప సరైన ఆధారాలను సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారని కోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంది. పటమట శాంతినగర్లోని ఎంటిఎస్ టవర్స్కు చెదిన బ్యాంక్ మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు నిరుడు మార్చి 15వ తేదీన హత్యకు గురైంది.
కేసు దర్యాప్తును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా నియమించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడితో పోలీసులు కేసు దర్యాప్తులో వేగం పెంచారు. అయితే, సకాలలో చార్జిషీట్ను దాఖలు చేయకపోవడంతో నాలుగో నిందితుడిగా చెప్పిన జనపాల కృష్ణ బెయిల్పై బయటకు వచ్చాడు.
దానిపై అప్పటి పోలీసు కమిషనర్ ఎబి వెంకటేశ్వర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆగకుండా అప్పటి పటమట ఇన్స్పెక్టర్ రవికాంత్ సహా మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అయితే, కేసును మాత్రం బలంగా తయారు చేయడంలో, సరైన సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారని కోర్టు తీర్పును బట్టి అర్థమవుతోంది.
హత్య జరిగిన 15వ తేదీ నుంచి నిందితులు కనిపించలేదని ఫిర్యాదులో తెలిపారు. ఆ తర్వాత మరుసటి రోజు మొదటి నిందితుడిగా పేర్కొన్న వ్యక్తి ఇంట్లో భద్రపరిచిన శవాన్ని బందరు కాలువలో పడేశారని చెప్పారు. వీరు ఆ ప్రాంతంలో లేరంటూనే మృతదేహాన్ని కాలువలో పడేశారని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారు.
సంఘటనకు ముందు నిందితులుగా పేర్కొన్నవారు షామియానా షాపులో కుట్ర చేసినట్లు పోలీసులు చెప్పారు. కానీ దానిపై ఆ షాపు యజమానిని విచారించి ఆధారులు చూపలేదు. అత్యాచారం చేసిన సమయంలో నోటికి అడ్డుగా పెట్టిన కర్చీఫ్ను, గొంతును బిగించడానికి వాడిన చీరను, ఘటన తర్వాత గదిని శుభ్రం చేయడానికి వాడినట్లు చెప్పిన వస్త్రాన్ని స్వాధీనం చేసుకుని కోర్టులో స్వాధీనం చేయలేదని న్యాయమూర్తి వెల్లడించారు.
హిమబిందు హత్య కేసులో కోర్టు తీర్పుపై మాట్లాడేందుకు ఆమె భర్త సాయిరామ్ మాట్లాడేందుకు నిరాకరించారు. పోలీసుల తీరుపై ఆమె సోదరుడు ఉదయ భాస్కర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.