జానకిరాం మృతి: ట్రాక్టర్ను గుర్తించారు, డ్రైవర్ ఉండి ఉంటే...
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరాం కారుకు జరిగిన ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ను గుర్తించారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జానకిరాం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం నాడు ఈ కారును పోలీసులు గుర్తించారు. ఈ ట్రాక్టర్ గరిడేపల్లి మండలం కోయినాగూడెంకు చెందినదని గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవరు పైన 304(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
కాగా, స్వయంగా కారు నమడపడమే జానకిరాం మృతికి దారితీసినట్లుగా చెబుతున్నారు. నల్గొండ జిల్లా ఆకుపాముల వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. డ్రైవర్ను తీసుకు వెళ్లకుండా, జానకిరామ్ స్వయంగా సఫారీ వాహనాన్ని నడుపుతూ హైదరాబాదు నుండి విజయవాడకు బయలుదేరారు.
కోదాడ శివారు ఆకుపాముల వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టరును ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. వరి నారు లోడుతో వస్తున్న ట్రాక్టర్ యూ టర్న్ తీసుకునే క్రమంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దాంతో సఫారీ కారు ఇంజిన్, కుడి (డ్రైవర్ కూర్చునే సీటు) భాగాలు నుజ్జునుజ్జయ్యాయి.
స్టీరింగ్, ముందు టైరు దెబ్బతిన్నాయి. జానకిరాం ట్రాక్టరు ట్రాలీ నేరుగా, బలంగా తగిలింది. ఒకవేళ కారు డ్రైవర్ నడిపి ఉంటే.. జానకిరాం ఎడమసీట్లో కూర్చునేవారు. దీంతో ఆయన ప్రమాదం నుండి బయడపడే అవకాశం ఉండేదని, కారు ఎడమ భాగంలోని ముందు డోరు దెబ్బతినకుండా ఉందని, సఫారీ కారును వేగంగా నడుపుతున్న ఆయన కనీసం సీటు బెల్టును కూడా పెట్టుకోలేదని అంటున్నారు. కారులో బెలూన్ తెరుచుకున్న ఆనవాళ్లు కనిపించడం లేదని తెలుస్తోంది.
జానకిరాం నుదురు, ముఖంపై గాయాలేవి కనిపించలేదు. అయితే, ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శ్వాస తీసుకోవడానికి ఆయన అవస్థ పడినట్లుగా కోదాడ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తన వెనుకభాగం, వెన్నెముక, ఎడమకాలు తొడభాగంలో విపరీతంగా గాయాలయ్యాయి. ఆయన శరీరం చికిత్సకు ఏమాత్రం సహకరించకపోవడంతో వైద్యులు కూడా ప్రాణాలు కాపాడలేకపోయారు.