"ఛలో విజయవాడ" టెన్షన్ - అనుమతి నిరాకరణ : నేతలకు నోటీసులు..!!
ఏపీలో పీఆర్సీ పోరు తీవ్రతరం అవుతోంది. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ.. స్టీరింగ్ కమిటీలో నిర్వహించిన చర్చలు ఫలితం ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి చర్చలు సానుకూల వాతావరణంగా జరిగాయంటూ ప్రభుత్వ సలహా దారు సజ్జల వెల్లడించారు. అయితే, కొత్త పీఆర్సీ ప్రకారం ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. వాటి మేరకు జీతాల జమ చేసింది. దీని ద్వారా జీతాల తగ్గింపు ప్రచారంలో వాస్తవం లేదని.. పే స్లిప్పులతో సహా నిరూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. గత నెల వేతనాలు..ఈ నెల పే స్లిప్పులను ప్రదర్శించింది. ఎక్కడ వేతనాలు తగ్గాయో చెప్పాలంటూ సూచించింది.

ఛలో విజయవాడ జరిగేనా
ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు కీలక ప్రకటన చేసారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావటంతో ఈ నెల 3వ తేదీన ఛలో విజయవాడతో సహా ఇప్పటికే నిర్ణయించిన కార్యాచరణ యధాతధంగా కొనసాగుతుందని ఉద్యోగ సంఘ నేతలు ప్రకటించారు. ఇందు కోసం జిల్లాల నాయకులు సైతం ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు.
ఛలో విజయవాడ విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు. దీంతో..పోలీసు శాఖ అప్రమత్తం అయింది. విజయవాడ నగర పోలీసు కమిషనర్ కీలక ప్రకటన చేసారు. ఉద్యోగుల ఫిబ్రవరి 3న తలపెట్టిన 'చలో విజయవాడ'కు పోలీసుల అనుమతి నిరాకరించారు. ఆ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా స్పష్టం చేశారు.
పోలీసుల అనుమతి నిరాకరణ
కొవిడ్ దృష్ట్యా ఉద్యోగసంఘాలకు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు చేపట్టారు. కార్యక్రమానికి వెళ్లొద్దని నోటీసులు జారీ చేస్తున్నారు. ఉద్యోగుల నిర్బంధంతో తమ పోరాటాన్ని ప్రభుత్వం ఆపలేదని.. స్టీరింగ్ కమిటీ నేత ఆస్కార్రావు తెలిపారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.
"చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు. కొవిడ్ దృష్ట్యా ఉద్యోగసంఘాలకు అనుమతి ఇవ్వలేదు. 200 మందితోనే బహిరంగ కార్యక్రమాలకు అనుమతి ఉందని.. 5 వేల మంది వస్తామని ఉద్యోగులు దరఖాస్తులో పేర్కొన్నారని పోలీసు అధికారులు చెప్పుకొచ్చారు. అంతమంది సభకు వస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లవుతుందన్నారు. దయచేసి చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు ఎవరూ రావద్దంటూ పోలీసు అధికారులు కోరుతున్నారు.

చర్చలు విఫలం అంటున్న సంఘాలు
ఉద్యోగ సంఘాలు ముందుగా ప్రభుత్వం ముందు తాము ఉంచిన డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని పీఆర్సీ సాధన సమితి నేతలు డిమాండ్ చేస్తున్నారు. సమ్మె వరకు వెళ్లద్దంటూ మంత్రులు కోరారు. అయితే, తిరిగి చర్చలకు సిద్దమని ప్రభుత్వం చెబుతోంది. ఈ రోజున మరోసారి చర్చలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందే అవకాశం ఉంది. మరో వైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు సైతం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్టీసీ ఎండీకి అందించారు. ఏ క్షణంలో అయినా సమ్మెకు సిద్దమంటూ ప్రకటించాయి. దీంతో..సమ్మె నివారణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సంఘాల నేతలు మాత్రం తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే అంటూ పట్టు వీడటం లేదు.

నేటి పరిణామాలే కీలకంగా
పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చిన వెంటనే సమ్మెలోకి దిగటానికి సిద్దమని కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీంతో..ఈ రోజు చోటు చేసుకొనే పరిణామాలు కీలకం కానున్నాయి. మరలా ప్రభుత్వం చర్చలకు పిలిచినా.. ఉద్యోగ సంఘాల నేతలు ముందుకు వస్తారా.. ఛలో విజయవాడతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉండటంతో...కొనసాగిస్తారా లేక, ప్రభుత్వ సూచనను పరిగణలోకి తీసుకుంటారా అనేది ఉత్కంఠగా మారుతోంది.
ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటే.. పోలీసులు సైతం ముందస్తు చర్యలు ప్రారంభించారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వం - ఉద్యోగ సంఘాల నేతల నిర్ణయాల పైనే ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications