టీడీపీ గూడుపుఠాణి...పోలీసులు కొమ్ముకాస్తున్నారు:భగ్గుమన్న బీజేపీ
తిరుపతి:తిరుమలలో అమిత్ షాపై దాడి అనంతర పరిణామాల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది. అమిత్ షా కాన్వాయ్పై దాడికి పాల్పడటం, బిజెపి నేత కోలా ఆనంద్ కారు అద్దాలు పగులగొట్టడం, అనంతరం అతడి అరెస్ట్ ను చిత్తూరు జిల్లా భాజపా నేతలు సీరియస్గా పరిగణిస్తున్నారు.
అమిత్షా కాన్వాయ్పై జరిగిన దాడి నేపథ్యంలో తొలుత టీడీపీ కార్యకర్త సుబ్రహ్మణ్యయాదవ్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తదనంతర విచారణలో భాగంగా పోలీసులు టీడీపీ, బీజేపీ నాయకులను స్టేషన్కు పిలిపించి విచారణ కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ను విచారణ కోసమంటూ స్టేషన్కు పిలిచి ఆ తరువాత అతడిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.
దీంతో రాత్రి 10 గంటల తరువాత మేజిస్ట్రేట్ దగ్గర బెయిల్ తీసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఇది పోలీసుల ద్వారా టీడీపీ ఆడిన నాటకమని తమ పార్టీ అధిష్టానానికి వివరించినట్లు తెలిసింది. దీంతో టిడిపి ప్రభుత్వ వైఖరిపై బిజెపి అధిష్టానం ఆగ్రహం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. తమ పార్టీ అధినేత అమిత్ షా కాన్వాయ్పై దాడికి పాల్పడటమే కాకుండా ఆత్మరక్షణ కోసం అడ్డుపడ్డ బిజెపి నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తారా అంటూ ఆ పార్టీ నేతలు ముఖ్యంగా చిత్తూరు జిల్లా భాజపా నేతలు మండిపడుతున్నారు. ఆ క్రమంలో తిరుపతి ప్రెస్క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి టీడీపీపై ఆరోపణలు గుప్పించారు.
తమ పార్టీ అధినేత కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వస్తే నిరసన పేరుతో టీడీపీ ఆయన కాన్వాయ్ను అడ్డుకోవడం ద్వారా ఆయనకు అవమానం జరిగిందని, తద్వారా తాము పార్టీ అధిష్టానం దగ్గర తల ఎత్తుకునే పరిస్థితి లేకుండా చేశారని బీజేపీ నాయకులు భగ్గుమన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శాంతారెడ్డి మాట్లాడుతూ "వంద తప్పులు తర్వాత శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించాడు. నాలుగేళ్లుగా మిత్రపక్షమైన టీడీపీ ప్రవర్తన, అవినీతి, దుష్టపాలనను సరిదిద్దుకోవడానికి అవకాశమిచ్చాం...దీన్ని చేతకానితనంగా భావిస్తే టీడీపీకి కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతాం"...అన్నారు. బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చూపడం టీడీపీ అనైతిక చర్యలకు పరాకాష్టగా ఆమె అభివర్ణించారు.
అమిత్ షా కాన్వాయ్ను అడ్డుకోవాలని టీడీపీ నేతలు వారి పార్టీ కార్యకర్తలకు రెండు గంటల ముందు నుంచే మెసేజ్లు పెట్టారని, ఈ విషయం వాట్సాప్లో వైరల్ అయ్యిందని, ఈ నేపథ్యంలో పోలీసులు ఎందుకు ముందుగానే టిడిపి కార్యకర్తలను చెదరగొట్టలేదని ఆమె ప్రశ్నించారు. దాడి జరుగుతుంటే ఆత్మరక్షణార్థం వాహనం దిగి ఆ దాడికి పాల్పడ్డ యువకుడిని పోలీసులకు పట్టిస్తే దాన్ని నేరంగా పరిగణించి కేసులు పెట్టడం దారుణమని ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని దారుణాలకు పాల్పడుతున్న టిడిపికి సంబంధించి భవిష్యత్తులో ఏ అవినీతి, ఇసుక దందాలను వదిలే ప్రసక్తి లేదన్నారు.
పోలీసుల అరెస్ట్ అనంతరం బెయిల్ పై వచ్చిన బిజెపి నేత కోలా ఆనంద్ మాట్లాడుతూ పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా తమపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. అమరావతిలో సీఎం డైరెక్షన్ చేస్తే ఇక్కడ తెలుగు తమ్ముళ్లు ఓవరాక్షన్ చేశారని మరో బీజేపీ నేత సామంచి శ్రీనివాస్ ఆరోపించారు. జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఘటన విషయమై టీడీపీ కూడా తనదైన వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కారు అద్దాలు పగులగొట్టారన్న నెపంతో బీజేపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడటం ఎంత వరకూ సబబని వారు వాదిస్తున్నారు.