నయా పోలీసింగ్: మతిస్ధిమితం లేని మహిళలకు రక్షణ
విశాఖపట్నం: అభాగ్యులు, మతిస్ధిమితం లేని మహిళల రక్షణ కోసం నగరంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు నగర శాంతి భద్రతల డీసీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు. పోలిస్ కమిషనరేట్ సమావేశంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇటీవల కాలంలో నగరంలో జరిగిన పలు సంఘటనలపై స్పందించిన నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ జోన్లకు టీమ్లను నియమించినట్లు తెలిపారు.

ఈ టీమ్లు ఐసీడీఎస్ అధికారులు సిబ్బంది సహకారంతో ఆదివారం ఉదయం 16 మంది మహిళలను రక్షణ, పోషణ నిమిత్తం పెందుర్తిలోని స్వాధార్ హౌస్లకు తరలించినట్లు ఆయన తెలిపారు. ముందుగా వారిని ఆసుపత్రులకు తరలించి వైద్య పరీక్షలు చేయించామన్నారు.
మతి స్ధిమితం లేని ఓ మహిళను సిరిపురం వుడా బిల్డింగ్ వద్ద సోమవారం పట్టుకుని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో చేర్చించి, చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈస్ట్ డివిజన్లో ఏసీపీ రమణ నేతృత్వంలో ఒక సీఐ, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు, ఒక ఐసీడీఎస్ టీమ్గా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications