రాజకీయ వ్యూహం: వైఎస్ జగన్కు కంట్లో నలుసులా మారిన కేఏ పాల్? కారు యాత్ర వెనక ఎవరు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024లో జరగబోయే ఎన్నికలు అంత ఆషామాషీగా ఉండబోవని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హోరాహోరీగా ఢీకొంటున్నాయి. మరోవైపు జనసేన నిర్ణయం ఏమిటనేది స్పష్టం కాలేదు. నిన్నటి వరకు కూరలో కరివేపాకులా తీసేసిన కేఏ పాల్ 'ప్రజాశాంతి' పార్టీ నుంచి ఇప్పుడు వైసీపీకి కొత్త తలనొప్పి లా మారింది. ఆయన ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కారుయాత్రకు శ్రీకారం చుట్టారు. ''పాల్ రావాలి - పాలన మారాలి'' అనే పేరుతో ఈ యాత్ర చేస్తున్నారు.
వైసీపీ రంగులను పోలివుండే ప్రజాశాంతి పార్టీ రంగులు
ఏ పార్టీ యాత్ర చేసుకున్నా, ఏ కార్యక్రమం నిర్వహించుకున్నా ఇబ్బంది ఉండదు కానీ ప్రజాశాంతి పార్టీతో వైసీపీకి ఇక్కట్లు ఎదురవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ రంగులు ఏవైతే ఉన్నాయో నీలం, తెలుపు, ఆకుపచ్చ.... అవే రంగులు ప్రజాశాంతి పార్టీకి ఉన్నాయి. ఒకేసారి రెండు పార్టీల జెండాలను దూరం నుంచి చూస్తే ఏ పార్టీ జెండా ఏది అనే తేడాను కనిపెట్టలేరు. వైసీపీకి ఫ్యాను గుర్తు ఉంటే, కేఏ పాల్కు హెలికాప్టర్ గుర్తు ఉంది. అంతే తేడా!!
ఫ్యాన్ రెక్కల్లాగే హెలికాప్టర్ రెక్కలు
పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజీనామాతో ఇప్పటికే ఇక్కట్లు ఎదుర్కొంటున్న వైసీపీకి కేఏ పాల్ కొత్త తలనొప్పులు సృష్టిస్తున్నారు. 'ప్రజాశాంతి' పార్టీ గుర్తింపును తొలగించాలని ఎప్పటి నుంచో వైసీపీ ఎన్నికల సంఘం వద్ద పోరాడుతోంది. రంగులతోపాటు హెలికాప్టర్ పై ఉండే రెక్కలు కూడా వైసీపీ ప్యాన్ ను పోలివుంటాయి. ఆయన యాత్ర చేయడంవల్ల 'ప్రజాశాంతి' పార్టీ గుర్తు ప్రజల్లోకి వెళితే ఇబ్బంది పడతామని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.
ఏ పార్టీ వ్యూహం?
తెలంగాణ నుంచి అకస్మాత్తుగా ఏపీకి రాజకీయాన్ని మార్చిన కేఏ పాల్ కారు యాత్రకు శ్రీకారం చుట్టడం వెనక బలమైన ప్రోద్భలం ఉందని వైసీపీ భావిస్తోంది. ఏ పార్టీ మద్దతుతో కేఏ పాల్ రంగంలోకి దిగారు అనే కోణంలో విచారిస్తోంది. ఇటీవల అమిత్ షాను కలిసి వార్తల్లో నిలిచిన పాల్ తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు చికాకు కలిగించే రీతిలో పర్యటించారు.
అకస్మాత్తుగా ఏపీకి తన రాజకీయాన్ని మళ్లించారు. అంతేకాదు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎనిమిది సంవత్సరాల కాలంలో మోడీ రూ.55 లక్షల కోట్ల అప్పులు చేశారని, 32 కోట్లమంది యువతకు ఉద్యోగాలు లేక దిక్కుతోచని స్థితిలో ఉందని ఆరోపించారు. అనుభవం లేని జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని, ప్రతి కుటుంబంపై రూ.7.5 లక్షల అప్పు ఉందన్నారు.
2014 ఎన్నికల్లో అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబునాయుడుకు మద్దతిచ్చానని తెలిపారు. కేసీఆర్, చంద్రబాబుపై సీబీఐకి అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కారు యాత్ర సాగుతుందని వెల్లడించారు.