తిరుమల మరో మహోత్సవం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల పోటెత్తుతోంది. భారీ వర్షాలను సైతం భక్తులు లెక్క చేయట్లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ భారీగా ఉంటోంది.
సోమవారం నాడు 75,361 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 28,850 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 3.91 కోట్ల రూపాయల ఆదాయం అందింది.

తిరుమలలో మొన్నటి వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు జరిగిన ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆరు లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 2.60 లక్షల మంది తమ తలనీలాలు సమర్పించుకున్నారు.
గరుడ సేవ రోజు 82,043 మంది దర్శించుకున్నారు. ఆ రోజున తిరుమలకు వచ్చిన మొత్తం భక్తుల సంఖ్య 3.5 లక్షలు. మొత్తంగా ఈ బ్రహ్మోత్సవాల సమయంలో హుండీ ద్వారా టీటీడీకి 26 కోట్ల రూపాయల ఆదాయం అందింది.
కాగా- ఈ బ్రహ్మోత్సవాల సందడి ముగిసీ ముగియగానే తిరుమల మరో మహోత్సవానికి సిద్ధమైంది. ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవ కార్యక్రమానికి ముస్తాబైంది. గురువారం దీన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు, అర్చకులు ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు.
ప్రతి నెలా పౌర్ణమి రోజున శ్రీవారికి గరుడ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనారూఢుడై ఊరేగుతారు. తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు కరుణిస్తారు.












Click it and Unblock the Notifications