బాబు, కేసీఆర్ ప'వార్': లేకుండా చేస్తామని హెచ్చరికలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మరోసారి సవాల్ విసిరారు. విద్యుత్ ఉత్పాదనతో పాటు ఏ అంశం పైన అయినా వారు ఎక్కడకు రమ్మంటే అక్కడ చర్చకు తాను బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. అలాగే సమస్యల పైన కేసీఆర్తో చర్చకు ఎప్పుడు సిద్ధమే అన్నారు.
శ్రీశైలం విద్యుత్ ఉత్పాదన విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగడ రాజుకున్న విషయం తెలిసిందే. దీని పైన చంద్రబాబు బుధవారం సాయంత్రం మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూపు లేదని, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పాదన సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
సమస్యల పైన కొట్లాడుకోవడం సరికాదని, చర్చించుకొని పరిష్కరించుకోవాలన్నారు. కొట్లాడుకుంటే..., కోర్టుకు వెళ్తే, కొన్నేళ్లు పడుతుందన్నారు. పద్ధతి ప్రకారం ఇద్దరం కలిసి పని చేద్దామన్నారు. పాలనానుభవం లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. విభజన చట్టం ప్రకారం వ్యవస్థాపిక ప్రాజెక్టుల్లో 54 శాతం ఇచ్చేందుకు తాము సిద్ధమన్నారు.
కట్టబోయే ప్రాజెక్టుల్లో కూడా 54 శాతం ఇవ్వమంటే ఎలా అని ప్రశ్నించారు. కొత్త ప్రాజెక్టులలోను ఇవ్వాలనడం సరికాదన్నారు. దీనిని తాము అంగీకరించేది లేదన్నారు. వీటీపీఎస్ వంటి ప్రాజెక్టులను 90 శాతం సామర్థ్యంతో పని చేయిస్తూ 54 శాతం ఇస్తున్నామన్నారు.
అలాగే, కొత్త ప్రాజెక్టులలో అదనపు విద్యుత్లో రెండు వేల మెగావాట్లు తెలంగాణకు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. నల్గొండలో పార్టీ కార్యాలయం పైన దాడి విషయమై స్పందిస్తూ.. గతంలో తమ పైన దాడులు చేసిన వారు కనబడకుండా పోయారన్నారు. ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. పోరాటం, త్యాగం తమ రక్తంలోనే ఉందన్నారు.
విద్యుత్ విషయంలో ఎస్సెమ్మెస్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం పైన తాము కృష్ణా రివర్ బోర్డుకు మళ్లీ ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తెలుగు వారి కోసం ఏర్పడిన టీడీపీ కార్యాలయం పైన దాడి చేయడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ నష్టం జరిగినా మా అకౌంట్లో వేయాలని చూస్తున్నారని విమర్శించారు.
కృష్ణా రివర్ బోర్డు ముందు తెలంగాణ వాదనలు
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు తెలిపింది. సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి అంశం పైన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. నిబంధనలకు లోబడే ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
విద్యుత్ విషయంలో టీఆర్ఎస్ వర్సెస్ టీ-టీడీపీ
విద్యుత్ విషయంలో తెలంగాణ తెలుగుదేశం, తెరాస మధ్యన తీవ్ర వాగ్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం నాడు నల్గొండ జిల్లాలో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టినప్పటి నుండి ఇరు పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం, హెచ్చరికలు చోటు చేసుకుంటున్నాయి. తమ పార్టీకి చెందిన కార్యకర్తలకు చెబితే తెరాస భవనంలో ఒక్క ఇటుక లేకుండా తీసేస్తారని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
దీని పైన తెరాస కూడా ధీటుగానే స్పందించింది. మంత్రి మహేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఇక్కడేం పని అని, తాము తల్చుకుంటే రాత్రికి రాత్రే టీడీపీ భవన్ లేకుండా చేస్తామన్నారు. తెలంగాణ భవన్ జోలికొస్తే తెలంగాణలో టీడీపీ కార్యాలయాలే లేకుండా చేస్తామని హెచ్చరించారు. నల్గొండ కార్యాలయంపై జరిగిన దాడిలో తమ ప్రమేయం లేదని, రైతులు, ప్రజలే స్వచ్చంధంగా పాల్గొన్నారన్నారు.
చంద్రబాబుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెదాలపై నవ్వు, కడుపులో విషం ఇదే చంద్రబాబు నైజమని ఆరోపించారు. వెన్నుపోట్లు, మోసం తదితర అంశాల్లో బాబుకు డాక్టరేట్ ఉందని ఎద్దేవా చేశారు. విద్యుత్ విషయంలో గవర్నర్ వద్దకు వెళ్ళిన కాంగ్రెస్ నేతలను విమర్శించేందుకు టీడీపీ నేతలకు మాటలు రావడంలేదన్నారు.