రూ.8 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ కళాభవన్...ఎక్కడంటే...
విజయవాడ: తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన చిరస్మరణీయ నటదిగ్గజం ఎన్టీఆర్...ఆయన స్మరణతో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారీ ఆడిటోరియం నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సైతం సిద్దమయ్యాయి.
విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వీటిలో భాగంగా ఈ కళాశాల ప్రాంగణంలో ఒక భారీ సభామందిరం నిర్మించాలని నిర్ణయించారు. ఆ సభామందిరానికి తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు పేరు పెట్టాలని కళాశాల పాలక వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి.

ఆడిటోరియం...ఎన్టీఆర్ పేరు...
ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్లో నూతన ఆడిటోరియం నిర్మించాలని ఎప్పటినుండో భావిస్తున్నారు. అయితే ఇటీవలే ఈ కాలేజ్ లో అభివృద్ది పనుల చేపట్టే విషయమై నిర్ణయం తీసుకోవడంతో అందులో భాగంగా ఆడిటోరియం నిర్మాణం ఖరారు చేసేశారు. ఆ ఆడిటోరియానికి తెలుగు వారి అభిమాన కథానాయకుడు...ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు పెట్టాలని నిర్ణయించారు.

ప్రతిపాదనలు సిద్దం...
ఎన్టీఆర్ కళాభవన్ పేరిట సభామందిరం నిర్మాణం ఖరారు కావడంతో అందుకోసం ప్రతిపాదనలను సైతం సిద్దం చేయించారు. ఎన్టీఆర్ కళాసదన్ నిర్మాణం కోసం డిజైన్లు కూడా సిద్దమయ్యాయని ప్రిన్సిపాల్ వెలగా జోషి మీడియాకు తెలిపారు. కళాశాల ఆవరణంలోని పాత భవనాన్ని పడగొట్టి అదే స్థలంలో నూతన కళాభవన్ను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు వెల్లడించారు.

నిర్మాణ వ్యయం...
అత్యుత్తమ నమూనాతో ఆధునిక హంగులతో ఈ ఎన్టీఆర్ కళాభవన్ నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం 8 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించామని, అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ వెల్లడించారు.

సకల సౌకర్యాలు...ఆధునిక హంగులతో...
నూతనంగా నిర్మించనున్న ఎన్టీఆర్ కళాభవన్లో అన్ని సౌకర్యాలు, ఆధునిక హంగులు ఉండేలా డిజైన్ చేశారు. 10,722 చదరపు అడుగుతో బేస్మెంట్ ఫ్లోర్, 5,215 చదరపు అడుగులతో అప్పర్ ఆడిటోరియం, 11,185 చడరపు అడుగులతో గ్రౌండ్ ఫ్లోర్ ఉండనున్నాయి, ఒక ఫ్లొర్లో లైబ్రరీ, ఈ-తరగతి గదులు, కారుపార్కింగ్కు ప్రత్యేకంగా కేటాయించారు.












Click it and Unblock the Notifications