ఆలస్యం చేస్తే మీకే ప్రమాదం..!! వైఎస్ జగన్, కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ హెచ్చరిక?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ముందస్తు యోచన అనేది ఇరువురు ముఖ్యమంత్రుల ఆలోచన కాదని, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వే చేసి ఇచ్చిన నివేదిక ప్రకారం తీసుకున్న నిర్ణయమని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి పీకే వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్కు ఆయన సహచరుడు రుషిరాజ్సింగ్ పనిచేస్తున్నారు. పీకే వ్యక్తిగతంగా పనిచేసేది తెలంగాణ ఒక్క రాష్ట్రానికే. ఇతర పార్టీలకు ఆయన సంస్థ ఐప్యాక్ పనిచేస్తోంది.

కేసీఆర్ బహిరంగంగానే.. జగన్ మౌనం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ముందస్తు ఖాయమంటూ ప్రకటన చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బహిరంగంగా ప్రకటన చేయనప్పటికీ ప్రభుత్వ చర్యలన్నీ అలాగే ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని అనుకూలంగా మలచుకునే స్థితిలో ప్రతిపక్షాలు లేవని, దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయ శూన్యతను మరోసారి భర్తీచేసుకోవాలని పీకే ప్పినట్లు తెలిసింది.

జోరుమీదున్న ప్రతిపక్షాలు
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అధికార టీఆర్ఎస్ను ఢీకొడుతున్నాయి. ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జోరుమీద ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంవల్ల ప్రతిపక్షాలు ఇప్పటికప్పుడు అధికార పక్షాన్ని ఢీకొట్టలేవని, అలాకాకుండా సాచివేత ధోరణితో ఆలస్యం చేసుకుంటూ వెళితే మీకే ప్రమాదంటూ పీకే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారని తెలుస్తోంది. ఈ ఏడాది చివరికి రెండు రాష్ట్రాల ముందస్తు ఎన్నికలపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

రెండు రాష్ట్రాల్లోను ముక్కోణపు పోటీ?
తెలంగాణలో ముక్కోణపు పోటీ అనివార్యంగా కనపడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న పవన్ కల్యాణ్ ప్రయత్నాలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో ఏపీలో కూడా ముక్కోణపు పోటీ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకుంటే వైసీపీయేతర పక్షాల మధ్య పొత్తు కుదరడం ఎండమావిలా కనపడుతోంది. చంద్రబాబునాయుడు మినీ మహానాడుల పేరుతో జిల్లా యాత్రలు చేపడుతున్నారు. పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవంబరు నుంచి బస్సు యాత్ర పేరుతో ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచించుకుంటున్నారు. బస్సు యాత్ర సమయంలోనే రానున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై ఒక స్పష్టత ఇవ్వనున్నారు. సాధ్యమైనంత త్వరగా ముందస్తు నిర్వహించాలని పీకే సూచించడంతో వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications