జగన్-కాంగ్రెస్ దోస్తీకి పీకే స్కెచ్-సీబీఐ కేసులతో లింక్ - వైసీపీ దూకుడు సంకేతమిదేనా ?
ఒకప్పుడు తమను ధిక్కరించాడన్న కోపంతో తమ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ ను దూరం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తోందా ? అకారణంగా ఏ సీబీఐ కేసులు మోపి జగన్ ను ఇబ్బంది పెట్టిందో అదే సీబీఐ కేసుల బూచితో తిరిగి జగన్ కు దగ్గరవ్వాలనుకుంటోందా ? ఇందుకు బీజేపీయే అవకాశమిస్తోందా ? తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తో కూడిన విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న జగన్ మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇందుకు స్కెచ్ గీస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
జగన్ ను వదులుకున్న కాంగ్రెస్
2009 ఎన్నికల్లో తొలిసారి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ కు వారి కంచుకోట కడపలో ఎంపీగా నిలబెట్టి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ... వైఎస్ మరణం తర్వాత మాత్రం ఆయన కోరుకున్న సీఎం పదవి ఇచ్చేందుకు ఇష్ట పడలేదు. వాస్తవానికి అప్పటికి వైఎస్ కుమారుడన్న ఒకే ఒక్క కారణంతో తొలిసారి ఎంపీ అయిన జగన్ ను సీఎం చేసేందుకు కాంగ్రెస్ నిరాకరించింది.
దీంతో జనంలో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగిన జగన్ ముందరి కాళ్లకు బంధం వేయడం ద్వారా మేం ఎంపిక చేసిన వారే సీఎం కావాలని కాంగ్రెస్ పెద్దలు కోరుకున్నారు. అలా ఎంపిక చేసిన రోశయ్యపై ధిక్కారం ప్రదర్శించేందుకు జగన్ చేపట్టిన ఓదార్పుయాత్రకు అనుమతి నిరాకరించడం ద్వారా కాంగ్రెస్ సీరియస్ హెచ్చరికలు చేసింది. చివరికి కాంగ్రెస్ ను వీడి వైసీపీతో ముందుకొచ్చిన జగన్ పై సీబీఐ కేసులు మోపి జైలుకు పంపింది. అయితే సరిగ్గా పదేళ్ల తర్వాత తాను కోరుకున్న విధంగా జగన్ సీఎం కాగా... అదే సమయంలో కాంగ్రెస్ కు జగన్ అవసరం వచ్చింది.
జగన్ ను దువ్వుతున్న కాంగ్రెస్?
గతంలో తమను ధిక్కరించారన్న కోపంతో సీబీఐ కేసులు మోపి జైలుకు పంపిన జగన్ .. ఇప్పుడు సీఎంగా ఏపీలో, దాదాపు 30 మంది ఎంపీలతో పార్లమెంటులో సత్తా చూపుతున్న వేళ.... ఆయన్ను దువ్వేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకోసం గతంలో జగన్ కు రాజకీయ వ్యూహకర్తగా, ఇప్పుడు తమకు వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపుతోంది.
కాంగ్రెస్ పార్టీకి జగన్ మద్దతివ్వాలంటే ఏం కావాలనే ప్రశ్నను పరోక్షంగా సంధిస్తోంది. గతంలో కాంగ్రెస్ తనపై చేసిన కక్షసాధింపు ప్రయత్నాల్ని మన్నించానంటూ స్వయంగా జగన్ చేసిన ప్రకటననే వాడుకుంటోంది. గతాన్ని మర్చిపోయి కాంగ్రెస్ తో జత కట్టాలని పరోక్ష సంకేతాలు పంపుతోంది.
ప్రశాంత్ కిషోర్ దౌత్యం
2019 ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయాన్ని కట్టబెట్టిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జాతీయ స్దాయిలో కాంగ్రెస్ సహా విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా తాను గెలిపించిన మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ తో పాటు మిగతా విపక్షాలను ఐక్యం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఆయన దౌత్యం ఫలించి ఇప్పటికే మమతా బెనర్జీ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ను కూడా కలిశారు. అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పలుమార్లు పీకేతో భేటీ అయి భవిష్యత్ రాజకీయాన్ని నిర్ణయించేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పుడు ఇదే కోవలో కాంగ్రెస్ ను క్షమించేసిన వైఎస్ జగన్ ను కూడా ఆ పార్టీకి దగ్గర చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
మళ్లీ సీబీఐ కేసులతోనే
గతంలో కేంద్ర దర్యాప్తు సంస్ధ సీబీఐని వాడుకుంటూ జగన్ పై అక్రమాస్తుల కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవే సీబీఐ కేసుల్ని వాడుకుంటూ జగన్ ను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి అధికారంలో లేకపోయినా తాము అధికారంలోకి వచ్చేందుకు సాయం చేస్తే జగన్ పై సీబీఐ కేసుల్ని తొలగించడం లేదా వీలైనంత తక్కువ ప్రభావం ఉండేలా చేస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో జగన్ కాంగ్రెస్ కు ఇప్పటికప్పుడు కాకపోయినా భవిష్యత్తులో దగ్గరయ్యేందుకు మార్గం సుగమం అవుతోంది. ఎలాగో జగన్ పై సీబీఐ కేసుల్ని తప్పించేందుకు బీజేపీ పెద్దలు సహకరించకపోతే అప్పుడు తామే ఆ హామీ ఇచ్చి జగన్ ను దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం పట్టొచ్చు.
బీజేపీపై వైసీపీ దూకుడు వెనుక ?
ప్రస్తుతం జగన్ పై సీబీఐ కేసుల విచారణ శరవేగంగా సాగుతోంది. మరోవైపు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ బీజేపీ మద్దతున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్లు వేసి ఇబ్బంది పెడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా జగన్ అక్రమాస్తుల కేసును కొలిక్కి తెచ్చేందుకు సీబీఐ కోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఏ నిమిషంలో ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్ధితి. మరోవైపు తనను ఆదుకుంటుందని భావించి తాను బేషరతుగా మద్దతిస్తున్న బీజేపీ కీలక సమయంలో హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తోంది. అటు ఏపీకి విభజన హామీలు అమలు చేయక, ఇటు తన కేసుల్లో సీబీఐ దర్యాప్తును అడ్డుకోలేని బీజేపీని పార్లమెంటులో ఇరుకునపెట్టేలా వైసీపీ ప్లాన్ అమలు చేస్తోంది.
కాంగ్రెస్ పై జగన్ నిర్ణయం అప్పుడే ?
తనపై అక్రమాస్తుల కేసుల రూపంలో సీబీఐ పంజా విసురుతున్నప్పటికీ బీజేపీ పెద్దలు మిన్నకుండటం, మిగతా విషయాల్లోనూ సహకారం అందించకపోవడంతో జగన్ లో అసహనం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పీకే సూచన మేరకు భవిష్యత్తులో కాంగ్రెస్ కు దగ్గరయ్యే దిశగా జగన్ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆఫర్ పై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని, కానీ 2024 ఎన్నికల కల్లా పరిస్ధితిని సమీక్షించి కీలక నిర్ణయం తీసుకుంటామని జగన్, విజయసాయిరెడ్డి పీకేకి చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా కాదని ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సీబీఐ దూకుడు పెరగడంతో పాటు గతంలో చంద్రబాబు ఎదుర్కొన్న పరిస్ధితులు తప్పవని జగన్ అంచనా వేస్తున్నారు.