కుప్పంలో సీఎం జగన్ అంచనాలు అందుకోలేకపోతున్న నేతలు
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా, రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహరచన చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిలవరించాలంటే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేయాలని భావిస్తున్నారు.

తొలిసారి ఎన్నికలో వైసీపీ విజయభేరి
కుప్పంలో గెలుపునకు సంబంధించి ఇప్పటి నుంచే ఆయన ప్రణాళిక రచించుకున్నారు. జగన్ తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్ ఇక్కడి వ్యవహారాలను చక్కబెడుతున్నారు. స్థానికంగా బలమైన నాయకులను వైసీపీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో ఇక్కడ వైసీపీనే విజయం సాధించింది. భారీస్థాయిలో నిధులు విడుదలచేసి అభివృద్ధి పనులు చేపట్టడంద్వారా ఓటర్లను పార్టీవైపునకు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పం పురపాలక సంఘానికి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 25 వార్డులకుగాను వైసీపీ 19 వార్డులు గెలుచుకోగా టీడీపీ 6 వార్డులకే పరిమితమైంది. అనంతరం ప్రభుత్వం కుప్పం పురపాలక సంఘానికి ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తోంది.

కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు
కుప్పంలో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడంలేదు. ఇటీవల జరిగిన పురపాలక సంఘ సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్లు కమిషనర్ పై విరుచుకుపడ్డారు. ఓటుకు 5వేల రూపాయల చొప్పున ఖర్చుచేసి మరీ ఎన్నికల్లో గెలిచామని, ఇప్పుడు నిధులు లేవు.. తర్వాత చూద్దామంటే కుదరదని, ప్రజల్లోకి వెళ్లి ముఖం చూపించుకోలేకపోతున్నాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ.10 లక్షలు అప్పుతెచ్చి పనులు చేశాం..?
రూ.10 లక్షలు అప్పుచేసి తెచ్చి పనులు చేశామని, ఇప్పుడు బిల్లులు చెల్లించకపోవడంతో నెలకు రూ.50 చొప్పున వడ్డీని 5 నెలల నుంచి చెల్లిస్తున్నామని కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ మునుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోతే అప్పిచ్చినవాడు చెప్పుతో కొడతాడని, తాను సమావేశం నుంచి వెళ్లిపోతున్నానని, గతంలో తీర్మానించిన పనులే చేయనప్పడు కొత్తవాటిపై తీర్మానం అర్థరహితమంటూ ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తే కొత్త పనులు చేస్తామని, లేదంటే కష్టమని కౌన్సిలర్లు ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. వీరిని శాంతపరిచి, ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రభుత్వం తరఫున నిధులు విడుదల చేయించాల్సిన నాయకులు ఎవరితోవ వారు చూసుకున్నారు. మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడే వీరికి తాము గుర్తుంటామని, అప్పుడే తేల్చుకుంటామంటూ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications