పులివెందులలో పోరు ఏకపక్షమేనా ? రంగంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు..!
ఏపీలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆ స్ధాయిలో ఉత్కంఠ రేపుతున్న ఎన్నిక పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక. ఈ ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ చనిపోయిన జడ్పీటీసీ కుమారుడు హేమంత్ రెడ్డిని రంగంలోకి దింపగా.. ఆయనకు పోటీగా కూటమి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలో నిలిపింది. అయితే తొలుత సానుభూతి కారణంగా ఏకపక్షంగా సాగిపోతుందనుకున్న ఈ పోరును పోటాపోటీగా మార్చేందుకు అధికార కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఆగస్టు 12న పులివెందుల జడ్పీటీసీ స్ధానానికి ఉపఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నిక కోసం రేపటితో ప్రచార పర్వం ముగియబోతోంది. దీంతో ఎలాగైనా ఈ సీటును కైవసం చేసుకునేందుకు వైసీపీ, టీడీపీ హోరాహోరీ ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్నికను వైసీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే.. ఎక్కడో విదేశాల్లో ఉన్న హేమంత్ రెడ్డిని తీసుకొచ్చి పోటీకి దింపింది. తద్వారా ఇక్కడ చనిపోయిన జడ్పీటీసీ కుటుంబంపై స్ధానికంగా ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకోవచ్చని ప్లాన్ చేసింది.

అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో చిన్న ఎన్నిక గెలిచినా ఆయన్ను ఓడించామని చెప్పుకునేందుకు అవకాశం ఉండటంతో జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ బరిలోకి దిగింది. అదీ స్వయంగా గత ఎన్నికల్లో జగన్ చేతిలో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డిని రంగంలోకి దించింది. తద్వారా ఈ పోరును తాము ఎంత సీరియస్ గా తీసుకుంటున్నామో చెప్పకనే చెప్పింది. దీంతో వార్ హోరాహోరీగా మారింది.

అయితే స్ధానికంగా నెలకొన్న పరిస్ధితులు, సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే వైసీపీ అభ్యర్ధి హేమంత్ రెడ్డి జడ్పీటీసీగా ఎన్నికవడం లాంఛనమే అన్న చర్చ జరుగుతోంది. దీంతో టీడీపీ చివరి నిమిషంలో కూటమి పార్టీలకు చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, టీడీపీ మంత్రులు కొలుసు పార్ధసారధి, సవితతో పాటు స్ధానిక ఎమ్మెల్యే మాధవీరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవితో పాటు పలువురు సీనియర్ నేతల్ని రంగంలోకి దింపి ప్రచారం చేయిస్తోంది. ఓ జడ్పీటీసీ ఉపఎన్నిక కోసం ఇంత మంది రంగంలోకి దిగడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నిక ఫలితం అర్ధమవుతోందని స్ధానికంగా చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications