వైఎస్ కొండారెడ్డి రీ ఎంట్రీ - బెదిరింపులు : రికార్డు చేసి సీఎంకు పంపు చూద్దాం..!!
వైఎస్ కొండారెడ్డి మరలా పులివెందులలో ప్రత్యక్షం. వస్తూనే సొంత పార్టీలోని ప్రత్యర్ధులపై బెదిరింపులకు దిగుతున్నారు. విమర్శలు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా..వైసీపీ కార్యకర్తను బెదిరించిన ఒక ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి జగన్ కు బంధువుగా చెప్పుకొనే పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండల వైసీపీ మాజీ ఇంఛార్జ్ వైఎస్ కొండారెడ్డి తిరిగి పులివెందుల లో ఎంట్రీ ఇచ్చారు. ఓ వ్యక్తిని బూతులు తిడుతూ.. హెచ్చరించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

బెదిరింపులు - హెచ్చరికలు
ఆ ఆడియోలో.. వైఎస్.భాస్కర్రెడ్డి చిన్నాన్నను పొరపాటుగా ఓ మాట మాట్లాడా.. దాన్ని నువ్వు రికార్డు చేసి సీఎం సర్కు పంపావు. నా వాయిస్ను రికార్డు చేస్తావా అంటూ వార్నింగ్ ఇస్తూ వైఎస్ కొండారెడ్డి చెలరేగిపోయారు. నువ్వు చక్రాయపేట వదిలిపెట్టి వెళ్లాలి. నడిరోడ్డుపై నీ బట్టలిప్పి కొట్టకపోతే.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీన్ని రికార్డు చేసి సీఎంకు పంపురా.. చూద్దాం...అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలో..వైసీపీలో కలకలంగా మారింది. కొండారెడ్డిని కొద్ది నెలల క్రితం ఒక కాంట్రాక్టర్ ను బెదిరించిన కేసులో జిల్లా నుంచి బహిష్కరిస్తున్నట్లు అప్పట్లోనే అధికారులు ప్రకటించారు. గతంలో ఒక కాంట్రాక్టర్ ను బెదిరించటాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్..ఆయన్ను అరెస్ట్ చేయాలని ఆదేశించారు.

సీఎం సీరియస్ -జిల్లా బహిష్కరణ వేటు
ఆ తరువాత బెయిల్ పైన బయటకు వచ్చిన కొండారెడ్డి పులవెందులకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకుని వైకాపా నేత వేల్పుల రామలింగారెడ్డి (రాము) సచివాలయం, ఇతర కార్యాలయాల కోసం నిర్మించిన భవన సముదాయాన్ని చూసి అభినందించారు. ఈ భవనాన్ని సెప్టెంబరు 1న సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సరిగ్గా సీఎం పర్యటనకు ముందు ఆయన నియోజకవర్గంలో ప్రత్యక్షమవ్వటం చర్చకు కారణమైంది. కొండారెడ్డి జిల్లా బహిష్కరణ విషయమై వివరణ కోరగా.. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని, అక్కడ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎస్పీ అన్బురాజన్ చెప్పుకొచ్చారు.

సీఎం పర్యటన వేళ..మరోసారి
కొండారెడ్డి వైసీపీ చక్రాయపేట కొద్దమండల కన్వీనర్గా పనిచేసేవారు. అక్కడ చీమచిటుక్కుమన్నా కూడా కొండారెడ్డి అనుమతి ఉండాల్సిందేనని ఆ ప్రాంత నేతలు చెబుతుంటారు. పలు విషయాల్లో కొండారెడ్డిపై తీవ్ర ఆరోపణలతో పాటు విమర్శలు వచ్చాయి. ఇడుపులపాయను అడ్డాగా చేసుకొని పలు సంఘటనలకు పాల్పడేవారని ప్రచారం ఉండేది. ఇప్పుడు తిరిగి కొండారెడ్డి హల్ చల్ చేయటం..సీఎం కడపకు వస్తుండంతో..కొండారెడ్డి వ్యవహారంలో రాజకీయంగా..అటు పోలీసు అధికారులు ఏం చేయబోతున్నారనేది చర్చనీయాంశంగా మారుతోంది.












Click it and Unblock the Notifications